Friday, April 26, 2024

3 నుంచి 83కు పెరిగిన ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాలు.. వారం పది రోజుల్లో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ డయాలసిస్‌ కేంద్రాల సంఖ్య 3 నుంచి 83కు పెరిగింది. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేదవారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. ఆదిలాబాద్‌, మ#హబూబ్‌ నగర్‌, ఖమ్మం లాంటి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83 కు పెంచింది. ఈ సంఖ్యను 102 కు పెంచాలన్న లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యుద్ధ ప్రాతిపాదికన డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్‌ యూజుడ్‌ ఫిల్టర్‌ను ఉపయోగించి డయాలసిస్‌ సేవలను తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నారు.

డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛను, ఉచిత బస్‌ పాస్‌ కూడా ఇస్తోంది. తెలంగాణలో ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే రోగి జీవిత కాలంపాటు అందిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తోంది. డయాలసిస్‌ రోగులకు పింఛను కూడా ఇస్తోంది. కిడ్నీ రోగులకోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత సుమారు రూ.700 కోట్లు కిడ్నీ రోగులకోసం ఖర్చు చేసింది. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు 49.8 లక్షల డయాలిసిస్‌ సెషన్స్‌ చేయడం జరిగింది. వచ్చే వారంలో 50 లక్షల సెషన్లు పూర్తి కానున్నాయి.

- Advertisement -

వారం, పది రోజుల్లో కేసీఆర్‌ న్యూట్రీషియన్‌ కిట్స్‌..

లంగాణ ప్రభుత్వం గర్భిణులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారం, పది రోజుల్లో కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ ప్రారంభించనున్నట్లు ఆర్థిక, వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు వెల్లడించారు. కామారెడ్డి సహా 9 జిల్లాల్లో.. 1.24 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ అందజేయనున్నట్లు తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్‌ కిట్స్‌, పుట్టక ముందు న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement