మన దేశ టీవీల మార్కెట్లో స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో వీటి సరఫరా 38 శాతం పెరిగయి. పండగ సీజన్, కొత్త మోడళ్ల విడుదల, డిస్కౌంట్లు, ప్రోత్సహకాలు వంటివి ఇందుకు కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. మన దేశ స్మార్ట్ టీవీ విభాగంలో ఇతర అంతర్జాతీయ బ్రాండ్లు అత్యధికంగా 40 శాతం వాటా కలిగి ఉన్నాయి. తరువాత స్థానంలో 38 శాతం వాటాతో చైనా బ్రాండ్లు ఉన్నాయి. భారత బ్రాండ్ల సరఫరాల్లోనూ వృద్ధి నమోదు అయింది. ప్రస్తుతం వీటి వాటా 22 శాతంగా ఉంది. చిన్న టీవీల అమ్మకాలు పెరుగుతున్నాయి. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 32-42 అంగుళాల స్మార్ట్ టీవీల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎల్ఈడీ డిస్ప్లే టీవీల వైపు ఎక్కువ మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు.
అయితే ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ లాంటి ఆధునిక సాంకేతిక ఉన్న టీవీలకు ఆదరణ పెరుగుతుందని పేర్కొంది. క్యూఎల్ఈడీ డిస్ప్లేతో రానున్న కాలంలో మరిన్ని టీవీలు విడుదల అవుతాయని తెలిపింది. డాల్ఫీ ఆడి¸యో, అత్యుత్తమ స్పీకర్లు లాంటి ప్రత్యేకతలు కూడా ఆయా బ్రాండ్లు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి.మొత్తం అమ్మకాల్లో స్మార్ట్ టీవీల వాటా 93 శాతానికి చేరింది. 20 వేల లోపు మరిన్ని మోడళ్లు వస్తే ఈ వాటా మరింత పెరుగుతుందని నివేదిక తెలిపింది. మొత్తం అమ్మకాల్లో ఆన్లైన్ ఇ-కామర్స్ సైట్ల ద్వారా జరుగుతున్న అమ్మకాలు 35 శాతానికి చేరాయి. పండుగల సీజన్లో ఆన్లైన్ ఇ-కామర్స్ సైట్స్ అన్నీ భారీ ఆఫర్లు, డిస్కౌంట్ ధరలు ప్రకటించడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ టీవీ అమ్మకాల్లో 11 శాతం వాటాతో చై నాకు చెందిన షియోమీ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానంలో 10 శాతం మార్కెట్ వాటాతో శాంసంగ్, 9 శాతం వాటాతో ఎల్జీ ఉన్నాయి. వన్ప్లస్ టీవీల అమ్మకాల్లో 89 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ వాటా 8.5 శాతంగా ఉంది. మన దేశానికి చెందిన వీయూ అమ్మకాలు గత సంవత్సరంతో పోల్చితే రెట్టింపు అయ్యాయి. స్మార్ట్ టీవీల మార్కెట్లోకి ప్రవేశించేందుకు పలు దేశీయ కంపెనీలు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని నివేదిక తెలిపింది. స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో వన్ ప్లస్, వీయూ, టీసీఎస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 20-30 వేల ధరల శ్రేణిలో కొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా ఎల్జి మూడో స్థానంలో నిలిచింది.