Thursday, May 16, 2024

పెళ్లి కాని వారు కూడా అర్హులే: ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

కారుణ్య నియామకాలకు సంబంధించి ఏపీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాహమైన కుమార్తెలు కూడా కారుణ్య నియామకానికి అర్హులేనని స్పష్టం చేసింది. ఓ ఉద్యోగి చనిపోయినప్పుడు కారుణ్య నియామకం కింద అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే క్రమంలో పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హురాలని పేర్కొవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.

వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ దయమంతి అనే మహిళ కారుణ్య నియామకంపై హైకోర్టును ఆశ్రయించింది. ఆర్టీసీలో డ్రైవరుగా పనిచేసిన తన తండ్రి పెంటయ్య 2009 మార్చిలో మరణించారని, కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరితే వివాహమైందన్న కారణంతో అధికారులు తిరస్కరించారని పేర్కొంది. పెళ్లయిందనే సాకు చూపారని, జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులేనని వాదనలు వినిపించారు. అయితే, బ్రెడ్‌విన్నర్‌ పథకం కింద పిటిషనర్‌ అనర్హురాలని, పెళ్లయినందున ఆమె అభ్యర్థనను తిరస్కరించామని ఆర్టీసీ తరఫున లాయర్ వాదించారు. గతేడాది మే 20న ఇచ్చిన ఇచ్చిన సర్క్యులర్‌ ప్రకారం మృతుల భార్య/భర్త, లేదా కుమారుడు లేదా పెళ్లికాని కుమార్తె మాత్రమే అర్హులని అన్నారు.

ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘జీవో 350 ప్రకారం పెళ్లయిన కుమార్తెలూ కారుణ్య నియామకానికి అర్హులే.. ఆర్టీసీ సర్క్యులర్‌లో ‘పెళ్లికానివారే’ అర్హులన్నారు.. అలా చెప్పడం వివాహిత కుమార్తెల పట్ల వివక్ష చూపడమేనని, కుమారుడికి వివాహమైన వారికి ఎలాంటి షరతూ విధించలేదు.. కుమారులు, కుమార్తెలు పెళ్లి చేసుకున్నారా.. లేదా? అనే అంశంతో సంబంధం లేకుండా జీవితాంతం తల్లిదండ్రుల కుటుంబంలో వారు భాగమే. కుమార్తెకు పెళ్లయినంత మాత్రాన ఆమెను పుట్టింటి కుటుంబంలో సభ్యురాలు కాదని చెప్పడం దారుణం. కుమారులు, కుమార్తెలకు తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు ఉంటాయని. తల్లిదండ్రులు కన్నుమూస్తే.. అంతిమ సంస్కారాలు నిర్వహించి, కుటుంబ బాధ్యతలను మోస్తున్న ఎందరో కుమార్తెలను చూస్తున్నాం.

ప్రస్తుత కేసులో తండ్రి మరణం తర్వాత వితంతువైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఏకైక కుమార్తె అయిన పిటిషనర్‌పై ఉంది. పిటిషనర్‌ భర్తకు శాశ్వత ఆదాయం లేదు. ఈ నేపథ్యంలో ఆమెను తగిన ఉద్యోగంలో కారుణ్య నియామకానికి పరిగణనలోకి తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తున్నాం’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. పిటిషనర్‌కు కారుణ్య నియామకం కింద తగిన ఉద్యోగం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ బట్టు దేవానంద్‌ తీర్పు వెలువరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement