Thursday, July 25, 2024

Uttar Pradesh : సీఏఏను ఎవ‌రూ ఆప‌లేరు : మోడీ

మోడీ వెళ్తే సీఏఏ కూడా వెళ్తుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. సీఏఏను ఎవరూ ఆపలేరని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అజాంఘర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్’ అని చెప్పారు. దేశ ప్రజలంతా మోడీనే మళ్లీ ప్రధాని అంటున్నారని ఆయన చెప్పారు.

పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీ బాధలను ఒక్కొకటిగా తొలగిస్తున్నామని చెప్పారు. మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని.. అందుకు, సీఏఏ చట్టమే ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. సీఏఏ కింద భారత్ పౌరసత్వం ఇవ్వడం ప్రారంభమైందన్నారు. దేశంలో వీరంతా చాలా ఏళ్లుగా శరణార్థులుగా ఉన్నారని చెప్పారు.

విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోందని మోడీ విమర్శించారు. ఇండియా కూటమి పేదల రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయిస్తామంటున్నారని.. మైనార్టీలకు బడ్జెట్ లో 50శాతం ఖర్చు చేస్తామంటున్నారని మండిపడ్డారు. 70ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజించి రాజకీయం చేశారని విపక్షాలపై ఫైర్ అయ్యారు. దేశమంతా ఇప్పుడు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంపై కూడా ఇండియా కూటమి విమర్శలు చేసిందని చెప్పారు. ప్రజలంతా బీజేపీ, ఎన్డీఏ కూటమితోనే ఉన్నారని.. మూడోసారి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement