Sunday, May 19, 2024

నరభక్షకులా సిగ్గు.. సిగ్గు..!

నరమాంస భక్షణ.. ఆధునిక కాలంలో ఎప్పుడూ వినిపించని మాట, వినకూడని మాట ఇప్పుడు వినాల్సి రావడం దురదృష్టకరం. మనతో ఉండేవారే, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని స్థితిలో జీవించాల్సి రావడం అంతకన్నా దురదృష్టకరం మామూలు మనుషుల్లోనే ఇలాంటి వారు ఉంటారన్న భావననే ఊహించలేం.. కేరళను దేవ భూమి అని ఇప్పటికీ పిలుస్తుంటారు. ఆ మధ్య కేరళను వరదలు ముంచెత్తినప్పుడు దేవుడు ఆగ్రహించబట్టే ప్రకృతి ఆగ్రహించిందని శాస్త్రాలు చదువుకున్నవారు వ్యాఖ్యానించారు. అది నిజమేనేమోనని చాలా మందికి అనిపించింది. అయ్యప్ప మాల ధరించేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ అయ్యప్ప దర్శనం చేసుకునే వారి సంఖ్య గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగింది. మాల ధరించేవారు నియమాలు, నిష్టలు పాటించక పోతే దేవుడు ఆగ్రహిస్తాడన్న నమ్మకం అందరిలో ఉంది. అటుంటి పవిత్రమైన ఆలయం నెలకొన్న కేరళలోని పథనం తిట్ట జిల్లాలో ఘోరాతి ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతి పర్చింది. ఇది నిజంగా జరిగిందా? కల్పితమా అని అనేక మంది ముక్కున వేలేసుకున్నారు. బుగ్గలు నొక్కుకున్నారు ఇద్దరు ఆడవారిని అత్యంత దారుణంగా, హీనాతిహీనంగా ముక్కలుగా నరికి పాలిధిన్‌ సంచుల్లో మూటకట్టారనీ, ఆ ముక్కలను ఆహార పదార్ధాలుగా వండుకుని తిన్నారన్న వార్తను మీడియాలలో చూడ గానే ఇది నమ్మశక్యంగా లేదని, తాము చూస్తున్నదీ, వింటున్నదీ నిజమేనా అని సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు.

దేశంలో విద్యాధికుల రాష్ట్రంగా కేరళకు పేరుంది. అక్షరాస్యతలో ఎంతో కాలంగా నెంబర్‌ వన్‌ స్థానంలోఉంది. దేశంలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది కేరళలోనే. ఆధునిక భావజాలానికీ, ఆధ్యాత్మిక చింతనకు కేరళ ప్రసిద్ధి. అన్ని భావాలకూ, అన్ని మతాలకూ సమాదరణ లభిస్తుంది. కేరళ ఈ మధ్య కాలంలో పర్యాటక కేంద్రాల రాష్ట్రంగా కూడా అభివృద్ధి చెందింది. పర్యాటక రంగంలో కేరళ కాశ్మీర్‌నీ, తమిళనాడునూ, డార్జిలింగ్‌ వంటి ప్రదేశాలను తలదన్నే రీతిలో అభివృద్ది చెందుతోంది. అభివృద్దిలో దూసుకుని పోతోంది. అటువంటి రాష్ట్రంలో అనాగరికమైన నరమాంస భక్షణ జరిగిందన్న వార్తను దేశంలో ఎవరూ నమ్మడం లేదు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాల్లో కూడా ఇటు వంటి ఘటనల గురించి వినలేదు, కనలేదు. నాలుగు దశాబ్దాల క్రితం ఉగండాలో ఈది అమీన్‌ అనే పాలకుడు ఇలాంటి దురాచారానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. అలాగే, కాంబోడియాలో పోల్‌పాట్‌ అధికారంలో ఉన్నప్పుడు జనాన్ని చంపి వారి పుర్రెలను షోకేసుల్లో బొమ్మల్లా అమర్చిన దృశ్యాలు మీడియాలో వచ్చాయి. కర్మభూమి అయిన మన దేశంలో ఇలాంటి ఘోరాలు చోటు చేసుకోవడం వినలేం, కనలేం. కేరళలో పూజలు, పునస్కారాల సందర్భంగా నరబలులకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. హిందూ మతం పేరిట జరిగిన ఆచారాలను ఆనాడు నారాయణ గురు వంటి సంస్కర్త లు సమాజంలో దురాచారాలనూ, చాందసవాదాలనూ వ్యతిరేకిస్తూ ప్రచారం చేశారు.

కేరళలో ఆధునిక భావ జాలం గలవారు అత్యధికులు, విద్యావంతులు, మేధావు లు కేరళకు చెందిన వారే. ఆధునిక కాలంలో కూడా ఎంతో మంది సంస్కర్తలు కేరళ నుంచే వచ్చారు. పొరుగున ఉన్న కర్నాటకలో కులాలు తెగల పరంగా మఠాలు ఏర్పడగా, కేరళలో మాత్రం కులాధి పత్యాన్ని ప్రశ్నించే సంస్కర్తలు ఎంతో మంది నారాయణ గురు ప్రభావంతో హిందూ మతంలోని ఔన్నత్యాన్ని గురించి ప్రచారం చేశారు. అంతేకాకుండా ఆధునిక కాలంలో కుల, మత రహిత వివాహాలను ప్రోత్సహిస్తు న్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యమంత్రి పినర య్‌ విజయన్‌ కుమార్తె ఒక ముస్లింని వివాహమాడింది. అలాగే, పలువురు రాజకీయ నాయకులు కుల, మత రహిత వివాహాలను ప్రోత్సహించారు.అందువల్ల కేరళ లో మూఢనమ్మకాలు, కులపరమైన భేదాలు లేని సమాజం కోసం కృషి జరుగుతోంది.అటువంటి రాష్ట్రం లో నరబలులు,మూఢనమ్మకాలు పేరిట సమాజంలో కొందరు స్వార్ధ పర శక్తులు సృష్టిస్తున్న అరాచకాల్లో భాగంగానే నరబలులలను చూడాల్సి ఉంటుంది. నర బలులు, క్షుద్ర పూజలు ఇంకా విశ్వసించేవారు, ప్రోత్స హించే వారుంటే వారిని సమాజంలో నుంచి తరిమి కొట్టాలి. అటువంటి వారికిపదిమందితో కలిసి జీవించే హక్కు లేదు. దురాశ, అత్యాశలు, వ్యక్తిగత బలహీనతలు గా మారితే ఇలాంటి వైపరీత్యాలు తప్పవేమోననని ఈ ఘోరకలి చెబుతున్నది. సామాజిక చైతన్యం రానంత వరకూ సమాజంలో మూఢనమ్మకాలు కొనసాగుతూనే ఉంటాయి. దేవాలయాల్లో ఉత్సవాల సందర్భంగా జంతుబలి వంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement