Monday, July 22, 2024

Editorial : నిలకడలేని మమత!

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి,తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ నిలకడ లేని రాజకీయ వేత్త. ఆమె ఎప్పుడు ఎలా మాట్లాడతారో ఆమెకే తెలియదు. ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ప్రతిపాదించింది తానేనని అంటారు. మళ్ళీ అదే నోటితో ఆమె తాను బెంగాల్‌లో ఆ కూటమిలో భాగ స్వామిని కాదనీ, ఆ కూటమికి బయటి నుంచి మద్దతు ఇస్తాననీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆ కూటమి భాగ స్వామిగా ఉంటామని అంటారు. ఆమె వైఖరి ప్రతి పక్షాలను గందరగోళ పరుస్తోంది.

- Advertisement -

మరో వంక బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమికి బలాన్ని చేకూరు స్తున్నది. అందుకే,కాంగ్రెస్‌ బెంగాల్‌ శాఖ అధ్యక్షుడు అధీర్‌ రంజన్‌ చౌదరి ఆమె మాటను నమ్మలేమంటూ ప్రకటన జారీ చేశారు. ఇండియా కూటమిపై ఆమె చేసిన ప్రకటనల కారణం గానే బీహార్‌ ముఖ్యమంత్రి, జనతా దళ్‌ (యు) నాయకుడు నితీశ్‌ కుమార్‌ కూటమికి గుడ్‌బై చెప్పి ఎన్‌డిఏ కూటమిలో చేరిపోయారు. ఇండియా కూటమి సారథ్యాన్ని తనకు అప్పగించాలన్నది మమత కోరిక. అయితే, ఆ మాట కూటమికి నేతృత్వం తనదేనని భావిస్తున్న కాంగ్రెస్‌ చెప్పడం లేదు. అందుకే, మమత మధ్యలో కాంగ్రెస్‌పై చిర్రుబుర్రు లాడుుతూ ఉంటారు. బెంగాల్‌లో ఇండియా కూటమిలో తమ పార్టీ భాగ స్వామి కాదని ఆమె ప్రకటించారు.

అలాగే, బెంగాల్‌లో తమ పార్టీకి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు లేదని ఆమె ఇదివరకే ప్రకటించారు. తన నాయకత్వాన్ని రాష్ట్రంలో ఎదురు లేకుండా చూసుకోవడం కోసం ఆమె అలా ప్రకటించి ఉంటారు. బీజేపీని ఆమె అంటరాని పార్టీగా పరిగణించడం లేదు. ఆ పార్టీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్‌ షాలంటేనే ఆమెకు కిట్టదు. బెంగాల్‌లో బీజేపీకి చోటు ఇచ్చిం దే మమతా బెనర్జీ.ఆమె సాయంతో రాష్ట్రంలో కాలూనిన బీజేపీ ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రి పదవి నుంచి గద్దె దింపాలని చూస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీకి 30 స్థానాలు వస్తాయని అమిత్‌ షా ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. బెంగాల్‌లో వామపక్షాల పాలన కొనసాగినంత కాలం కమలనాధులు రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు జంకేవారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో బెంగాల్‌లో అధికారం తమదేనని ధీమాగా చెబుతున్నారు.

ఈ పరిస్థితి ఇలా మారడానికి మమతా బెనర్జీయే కారణ మన్నది వామపక్షాల ఆరోపణ. మూడున్నర దశాబ్దాల పాటు రాష్ట్రంలో తిరుగులేని విధంగా పాలన సాగిం చినవామప క్షాలను మట్టి కరిపించిన మమతా బెనర్జీ ఇప్పుడు బీజేపీ మతతత్వ ధోరణులకు వ్యతిరేకంగా తాను మాత్రమే పోరాడ గలనని ప్రకటించుకుం టున్నారు. లౌకిక వాదుల్లో చీలికను ఆసరాగా చేసుకుని బీజేపీ దేశమంతటా విస్తరిస్తోందన్న వాస వాన్ని అందరూ అంగీకరిస్తున్న వేళ మమతా బెనర్జీ అనుసరి స్తున్న వైఖరి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లిలో మార్క్సిస్టులకు ఒక్క స్థానం కూడా లేకుండా చేశానని ఆమె ఆనందిస్తూ ఉండవచ్చు. కానీ, తన పీఠానికి బీజేపీ ఎసరు పెడుతోందన్న వాస్తవాన్ని ఆమె గ్రహించలేక పోతున్నారు. మార్క్సిస్టు ఫ్రంట్‌ ప్రభు త్వాన్ని గద్దె దింపేందుకు ఆమె రాజీలేని సుదీర్ఘ పోరా టం చేసిన మాట నిజమే. దాని వల్ల సాధించిన ఫలితాన్ని బీజేపీ చేతుల్లో పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారన్న మార్క్సిస్టుల ఆరోపణల్లో అసత్యం లేదు.

బీజేపీతో ఆమెకు సైద్ధాంతిక వైరం లేదు.బెంగాల్‌లో సుదీర్ఘ కాలం మార్క్సిస్టు ఫ్రంట్‌ పాలన వల్ల పెద్ద పరిశ్రమలేవీ రాలే దని ఆమె అనేవారు.ఇప్పుడు కేంద్రంతో వైరం పెట్టుకో వడం వల్ల పరిశ్రమలేవీ రావడం లేదు. రాజకీయంగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న యావ తప్ప ఆమెకు రాష్ట్ర ప్రయోజనాలు కూడా పట్టవు. అయితే, కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాకుండా ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశాలుంటే బయటి నుంచి మద్ద తు ఇస్తానంటూ సన్నాయి నొక్కులు ప్రారంభించారు. హిందీ రాష్ట్రాల్లో కోల్పోయే స్థానాలను బెంగాల్‌లో రాబట్టుకుని తమ లక్ష్యమైన400 సీట్లను సాధించాలని కమలనాథులు ప్రయత్నిస్తున్న వేళ,ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కడివన్న తార్కి కతను కూడా ఆమె అంగీకరిస్తున్నట్టు లేదు. ఇండియా కూటమి నేతృత్వం తమ పార్టీదేనని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది.ఈ నేపథ్యంలో ఒక వేళ ఇండియా కూటమికి మెజారిటీ వస్తే ఆ కూటమికి బయటి నుంచైనా మమత మద్దతు ఇస్తారా? అన్నది అనుమానమే. అందుకే, కాంగ్రెస్‌ బెంగాల్‌ శాఖ నాయకుడు అధీర్‌ రంజన్‌ చౌదరి మమత మాటలను నమ్మలేమన్నారు. నిలకడ లేని వైఖ రి వల్ల ఆమె మిత్ర ప క్షాల విశ్వసనీయతను కోల్పోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement