Monday, May 6, 2024

దేశంలోనే మిషన్ భగీరథ గొప్ప పథకం : మంత్రి ఎర్ర‌బెల్లి

వరంగల్ : ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు సాధించిన సందర్భంగా ఆ శాఖకు చెందిన పలువురు ఇంజనీరింగ్, ఇతర అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సన్మానించి, అభినందించారు. వరంగల్ – హనుమకొండ – చింటగట్టు లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి మిషన్ భరిత కార్యాలయం, నీటి శుద్దీకరణ, నాణ్యత ప్రమాణాలు పరీక్షలు, పంపిణీ వంటి ఇతర అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతి మనిషి నిత్యావసర నీళ్లు, శుద్ధి చేసిన, పరిశుభ్రమైన మంచినీటిని అందించడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయి.

మోటార్లు, స్టార్లు, ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోయేవ‌ని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు తన పదవీ కాలం నీళ్లు ఇవ్వడానికి సరిపోయేది కాదు అన్నారు. సీఎం కేసీఆర్ ఏ ముహూర్తాన ఈ కార్యక్రమం చేపట్టాడో కానీ అద్భుతమైన పథకాన్ని మొదలు పెట్టాడు అన్నారు. నేను అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండగా అనేక సార్లు ప్రశ్నించాను అన్నారు. కేసీఆర్ కాస్త ఓపిక పట్టమని చెప్పేవారు.. మిషన్ భగీరథ కార్యక్రమం అమలు చూసి, నేను టీఆర్‌ఎస్ లో చేరాను అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, స్మితా సబర్వాల్ తదితరులు బాగా కష్ట పడ్డారని గుర్తు చేశారు. వాళ్లకు కృతజ్ఞతలు, అభినందనలు అన్నారు. నేను ఈ శాఖకు మంత్రిగా వచ్చే సరికి, మిషన్ భగీరథ స్థిరీకరణ జరిగింది. ఇప్పుడు అద్భుత ఫలితాలు వచ్చాయి. వాటిని మనం ఇవ్వాళ అనుభవిస్తున్నాం, ఆ కారణంగానే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి అన్నారు. మనం ఇస్తున్న మంచినీరు స్వచ్ఛమైనవి, ఆరోగ్య కరమైనవి, కేంద్రం పార్లమెంటులో లిఖిత పూర్వకంగా మన రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా చెప్పింది. ఇప్పటి వరకు 53 అవార్డులు వచ్చాయి. స్మితా సబర్వాల్ మాట్లాడుతూ.. అవార్డులు రావడంలో అందరి కృషి ఉంది, అత్యంత ప్రతిభావంతంగా పని చేస్తున్న మిషన్ భగీరథ సిబ్బందికి, అధికారులకు అభినందనలు అన్నారు. ఇంత గొప్ప శాఖకు నేను ఇంచార్జీ గా ఉన్నందుకు గర్వ పడుతున్నాను అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement