Friday, April 26, 2024

స‌డ‌ల‌ని రాహుల్ ప‌ట్టు…

అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు బెంగాల్‌పైనే దృష్టిని కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి 30 మందితో ఒక జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. ఈ జాబితాలోఉన్న వారంతా పార్టీ నాయకుడు రాహుల్‌ గాంధీ బృందంలోని వారే. ప్రధానంగా ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, పంజాబ్‌, రాజ స్థాన్‌, చత్తీస్‌గఢ్‌, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీప్రధాని మన్మోహన్‌ సింగ్‌ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ కాశ్మీర్‌ మాజీముఖ్యమంత్రి గులామ్‌ నబీ ఆజాద్‌, పార్లమెంటులో పార్టీ నాయకునిగా చాలా కాలం సేవలందించిన కపిల్‌సిబాల్‌ వంటి సీనియర్‌ నాయకులకు స్థానం లభించలేదు. వీరంతా పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ గత సంవత్సరంఆగస్టులో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు.చాలా నెలలతర్వాత ఆ లేఖ రాసిన 23 మంది సీనియర్‌ నాయకులను పిలిపించి వారితో సోనియా చర్చలు జరిపారు.పార్టీలో సీనియర్ల అసంతృప్తి చల్లారిపోయినట్టుగానే కనిపించింది. మళ్ళీ ఇటీవల కపిల్‌ సిబాల్‌ పార్టీ పరిస్థితి పై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారి అసంతృప్తికి ప్రధానకారణమైన పార్టీ నాయకత్వంపై అసంతృప్తి ఇంకా అలాగే ఉంది.ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఈ అంశాన్ని పరిశీలించవచ్చని వాయిదా వేశారు. అయితే, ఎన్నికలలో జనాన్ని ఆకర్షించడంకోసమే నాయకత్వ మార్పు కోసం ఈ నాయకులు సోనియాకి లేఖ రాశారు. మళ్ళీ అవేపాత ముఖా లతో ప్రచారానికి వెళ్ళడమంటే మళ్ళీ అలాంటి ఫలితాలే వస్తాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంది. ప్రధానంగా వీరంతా రాహుల్‌ గాంధీని దృష్టిలో ఉంచుకుని నాయ కత్వ మార్పు డిమాండ్‌ను తెరమీదికి తెచ్చారు.అయితే, బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి ఎంపిక చేసిన స్టార్‌ క్యాంపైన్‌ కమిటీ లో అంతారాహుల్‌ అనుకూలురే ఉన్నారు. పార్టీపై ఆయన పట్టు సడలి పోలేదన్న విషయం ఇది తెలియజేస్తోంది. దీనికి తగ్గట్టుగానే పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తాను బూత్‌ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నాననీ, వారిలో 99 శాతం మంది రాహుల్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. స్టార్‌ క్యాంపైన్‌ కమిటీని పార్టీ అధిష్ఠాన వర్గ ప్రతినిధి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించిన రోజునే చిదంబరం ఈ ప్రకటన చేయడం గమనార్హం. కేరళలో పరిస్థితివేరుగా ఉంది. అక్కడ సీపీఎం కూటమికీ, కాంగ్రెస్‌ కూటమికీ మధ్య పోటీ జరగనుండటంతో అక్కడ చాలాకాలం పార్టీకి విధేయునిగా ఉన్నపీసీ చాకో రాజీనామా చేయడంతో పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఎన్నికల సర్వేల్లో కేరళ లో ఈ సారి కూడా కేరళలో సిపిఎం కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. ఆన వాయితీ ప్రకారం ఈసారి కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి రావాలి. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఊమన్‌ చాందీపై ఆరోపణలు కారణంగా ఆయనను సిఎం అభ్యర్థిగా ఎంపిక చేయరాదని పలువురు కోరుతున్నారు. ఈ నేపధ్యంలోనే చాకో రాజీనా మా చేశారు. బెంగాల్‌లో సిపిఎంతో కాంగ్రెస్‌ పొత్తును కలిగి ఉంది.కేరళలో సిపిఎంని ప్రధా న ప్రత్యర్ధిగా పరిగణిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో పట్టు కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బీజేపీ ఇదే విషయాన్ని రెండు చోట్లా ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. కేరళలో బీజేపీ పట్టు సాధించలేదు. బెంగాల్‌లో అధికారంలోకి రాకుండాచేయడం కోసం సిపిఎంతో కాంగ్రెస్‌ ఒక అవగాహనకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అధిష్టానం ఏర్పాటు చేసిన ప్రచార కమిటీలో అంతా బెంగాల్‌ మీద దృష్టిని కేంద్రీకరించిన వారే కావడం గమనార్హం. అక్కడ ముస్లింలను ఆకట్టుకోవడానికి సీనియర్‌ నాయకుడైన గులామ్‌ నబీ ఆజాద్‌ పేరును కమిటీలో చేర్చకపోవడం పట్ల పార్టీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్నాయి. రాహుల్‌కు అనుకూలమైన వారికే పదవులు, ప్రచార బాధ్యతలు దక్కుతున్నాయన్న విమర్శలు బహి రంగంగానే వినిపిస్తున్నాయి. ప్రచారంలో జనాన్ని ఆకట్టుకోవడంలో రాహుల్‌ విఫలమ య్యారని సోనియాకు లేఖరాసిన సీనియర్లలో పలువురు విడిగా పత్రికా గోష్టుల్లో విమర్శిం చడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement