Saturday, April 27, 2024

గోవర్ధనగిరిధారిగా నారసింహుడి దర్శనం.. రేపు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం

యాదగిరిగుట్ట, ప్రభన్యూస్‌: యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) ఆరవ రోజు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గోవర్ధనగిరిధారిగా అలంకరించారు. వేద మంత్రాలు.. మంగళ వాయిద్యాలు.. సన్నాయి మేళాలు మారుమ్రోగుతుండగా.. పారాయాణికులు పారాయాణాలను పఠిస్తుండగా ప్రధానాలయ మాఢవీధుల్లో భక్తుల దర్శనార్థం ఊరేగించారు. రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవ పై శ్రీ స్వామి, అమ్మ వారు ఊరేగారు. ఈ సందర్భంగా శ్రీ స్వామి వారి అలంకార సేవలను పశ్చిమ మహారాజగోపురం ఎదురుగా ఉన్న వేంచేపు మండపంలో సేదతీర్చి సేవ విశిష్ఠతను ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. భక్తులు సేవలను దర్శించి తరించారు.


బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవాన్ని రేపు (సోమవారం) తూర్పు రాజగోపురం ఎదురుగా గల మాఢవీధుల్లో వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు గజవెల్లి రఘు, గట్టు శ్రవణ్‌కుమార్‌, అధికారులు దయాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వయంభువుల సేవలో సినీ ప్రముఖులు..

యాదాద్రి క్షేత్రాన్ని ఇవ్వాల (ఆదివారం) ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, దిల్‌రాజు వేర్వేరుగా సందర్శించారు. గర్భాలయంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం గావించగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement