Sunday, May 19, 2024

చిత్త శాంతియే సర్వ శాంతి!

పూర్వం ఒకానొక కాలంలో మందర పర్వతం మీద భృగుడనే యోగి జీవిస్తూ ఉండే వాడు. అతడికి శుక్రుడనే కొడుకు ఉండేవాడు. నిత్యం యోగ సమాధిలో ఉండే తం డ్రికి సపర్యలు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు శుక్రుడు. అలా రోజులు గడు స్తూ ఉండగా, ఒకనాడు ఆకాశ మార్గంలో విహరిస్తూ వెళుతున్న విశ్వాచి అనే ఒక దేవకన్య ను అతడు చూస్తాడు. ఆమె అందానికి మోహపరవశుడై, మానుష శరీరాన్ని తండ్రి చెంతనే వదిలి యోగబలంతో తన మనస్సనే దివ్యాంగధారణ చేసి, ఆ ఆకారంతో ఆమె వెంట పడి వెళ్ళిపోతాడు. ఆమెతో కూడి సర్వసౌఖ్యాలూ అనుభవించడంలో ఎంతోకాలం గడిచిపో తుంది. ఆ తరువాత దానికి కొనసాగింపుగా మరెన్నో జన్మాంతరాల కాలం వివిధాలైన జన్మ లతో గడిచిపోతుంది. ఇన్నేండ్ల కాలం గడిచినప్పటికీ, తండ్రియైన భృగుడి తపోబలం ఫలితంగా, శుక్రుడు వదిలి వెళ్ళిపోయిన మానవ శరీరం మాత్రం చెడిపోకుండా, అలాగే ఉంటుంది. అలా కాలం గడిచిపోగా, కొన్ని వందల సంవత్సరాల వ్యవధి తరువాత, తాను న్న దివ్య సమాధిలోంచి తెలివిలోకి వస్తాడు భృగుడు. చెంతనేపడి ఉన్న పుత్రుని కళేబరం చూసి, ఒక్కసారిగా శోకంలో మునిగిపోతాడు. ఆ బాధలో మనుషుల మరణానికి కారకుడైన యముడిని శపించడానికి పూనుకుంటా

డు. వెంటనే యముడు ప్రత్యక్షమై…

తే.గీ. అకట పెద్ద కాలమబ్భంగిఁజేసిన
తపము వీటిఁబోవదామసమున
నేలయలిగి కన్నులెఱ్ఱసేసెదు నిన్ను
నేమిసేసినాఁడ నిద్దచరిత.
(మడికి సింగన, వాసిష్ఠ రామాయణము, తృతీయాశ్వాసం)

‘ఇన్ని సంవత్సరాలు చేసిన తపస్సు ఫలితం అంతావృథా అయిపోయేవిధంగా, అప రిమితమైన క్రోధంతో నాపై ఎందుకు కళ్ళెఱ్ఱ చేస్తున్నావు? ఇందులో నేను చేసిన తప్పు ఏముం ది గనక?’

కం. పాపంబులేదు నాపై
కోపంబుపసం#హరింపు క్రూరాత్ముఁడవై
శాపించితేని నిన్నును
శాపింపఁగ నేర్తు నేను శాసకుఁడజుమీ.
”ఇందులో నా పాపం ఏమీలేదు. జరిగినదేమిటో పూర్తిగా తెలుసుకోకుండా క్రోధం నిండిన చిత్తంతో నీవు నన్ను శపించడానికి పూనుకుంటే, నేనూ ప్రతిగా నిన్ను శపించవలసి ఉంటుంది. నేను శాసకుడిని సుమా!” అని చెప్పి తన తాహతును గుర్తుచే స్తాడు. ”ఇంత తపస్సమాధిలో కాలం గడిపిన తరువాత కూ డా నీవు శాంతస్వభావుడవు కాలేదు. క్రోధం నిండి న మనసుతో కాకుండా శాంతచిత్తంతో ఆలోచించు. నీ కుమారుడి గు రించి నీకు కావలసిన సమాచారం అంతా నేను చెబుతా ను. ‘చిత్త శాంతి యే సర్వ శాంతి’ అన్న సంగతిని ఇప్పటికైనా గ్రహంచు” అని అంటాడు.
యముడి పైమాటలతో కోపం తగ్గించుకున్న భృగుడు ”నీకు తెలియకుండా ప్రాణం ఎలా పోతుంది? నా కొడుకైన శుక్రుడు ఎలా మృతుడయ్యాడు? ఆ సంగతంతా సవివరంగా తెలియజెయ్యి” అని యముడిని అర్థిస్తాడు.
భృగుడు యోగ సమాధిలో ఉండగా అతని కుమారుడైన శుక్రుడు దేవకన్య మీది మో హంతో ఎలా తన స్వంత శరీరాన్ని అక్కడే వదిలేసి, మనస్సు అనే దివ్య శరీరాన్ని ధరించి ఆమె వెంట వెళ్ళినది, ఆ తరువాత గడిచిన అనేకానేక జన్మలలో అతడు ఏఏ రూపాలు ధరిం చినది… అంతటినీ భృగుడికి వివరిస్తాడు యముడు. చివరగా అతడు అప్పుడు జటావల్క ధరుడు, రుద్రాక్షమాలాలంకృతుడు, ఇంద్రియ వర్జితుడును అయి అత్యంత నియమ నిష్ఠల తో తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి తీసుకుపోతాను రమ్మని భృగుడిని అతడి కొడుకు దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తాడు.
తండ్రిని చూడగానే పశ్చాత్తాపంతో వినమ్రచిత్తుడై నమస్కరించిన శుక్రుడు ‘మాయా భ్రమ చిత్తం బిటుసేయ విజృంభించె, వృద్ధ సేవ దొఱంగెన్‌’ అని మోహం తన మనసును వశం చేసుకోగా వృద్ధాప్యంలో తండ్రి సేవ వదిలి వెళ్ళిపోయి ఎన్నెన్నో జన్మల కాలం దూర మైనందుకు ఎంతగానో బాధపడతాడు. తాను ఎప్పుడో వదిలేసిన శరీరం ఇంకా మందర పర్వతం మీదనే ఉన్నదనీ, సత్వరం చూడాలనే కోరిక కలుగుతున్నదని చెప్పగానే, యముడు ఆ ప్రదేశానికి ఇద్దరినీ చేరుస్తాడు. ఆనందంగా తన పూర్వ శరీరంలోకి తిరిగి ప్రవేశించిన శుక్రుడు, పూర్వం వలె తండ్రి సేవలో లీనమౌతాడు.
కం. మానుగ సంసార స్థితి
మానసమున నొదవుటెఱుఁగు మార్గంబీయా
ఖ్యానంబున నెఱిఁగించితి,
మానస నిగ్రహమె శాంతి మనుకుల తిలకా!
‘శుక్రోపాఖ్యానం’ అన్న పేరుతో వసిష్ఠుడు శ్రీరాముడికి చెప్పిన ఈ కథలో, మనస్సును నిగ్రహంచుకోవడం అన్న కష్టతరమైన విలువలోనే మనిషికి శాంతి లభిస్తుందన్నది సారాం శంగా నిరూపించబడిన పరమ సత్యం! కేవలం క్షణకాలం మనోనిగ్రహం కోల్పోవడం వల న జరిగే అపారమైన నష్టాన్ని శుక్రుడి వృత్తాంతం ద్వారా వసిష్ఠ మహర్షి శ్రీరాముడికి చెప్పా డు. విశ్వాచి అనే దేవకన్య వెంట వెళ్ళిపోయిన శుక్రుడు ఆమెతో భోగ జీవనం ఫలితంగా భోగజరాత్ముడై ఆ తరువాత ఒక బ్రాహ్మణుని ఇంట పుడతాడు. ఆ తరువాత ఒక రాజుగా, వేటగాడిగా, ఒక రాజహంసగా, ఒక మునికుమారుడుగా, ఒక సామంతరాజుగా, #హరిణ ముగా, పాముగా… ఇలా పెక్కు జన్మల పర్యంతం జనన మరణాల వలయంలో తిరుగాడు తూనే వుంటాడు తప్ప, తండ్రి చెంత విడిచి పెట్టిన తన నిజ దేహంలోకి మళ్ళీ చేరలేడు. యోగ మూర్తియైన భృగుడు సంకల్పించడం వలననే అది అతనికి మరలా సాధ్యమయిందే తప్ప అన్యం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement