Sunday, May 12, 2024

తెలుగు నేలపై శైవమత వ్యాప్తి

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్ట్రకూట, కాకతీయ, అనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే తెలుగు నేలలో శైవారాధన ఉంది. గాథా సప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు. చేతికందుతున్న చరిత్ర ఆధారంగా శ్రీముఖుడు కాణ్వ రాజైన సుశర్మను వధించి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, వివిధ చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి, శ్రీ.పూ.1వ శతాబ్దిగా స్పష్టమవుతున్నది. శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. శాతవాహన 17వ రాజైన హాల చక్రవర్తి, సింహళ రాకుమారి లీలావతిని సప్త గోదావరీ తీరస్థ భీమేశ్వరాలయం, నేటి జగిత్యాల జిల్లాలోని వేంపల్లి వెంకటరావుపేటలో వివా#హ మాడినట్టు నాటికి భీమేశ్వరాలయం ఉన్నట్లు నిరూపితమైంది.
బౌద్ధమతంలోనూ నాగదేవత అరాధన ఉంది. స్థూపాలను పెనవేసుకున్న నాగ సర్పాల చిత్రాలు ప్రధానంగా ధూళికట్ట స్థూపంపై ఐదుతలల నాగ ముచిలింద శిల్పాన్ని చూడవచ్చు. ఇక్ష్వాకు (క్రీ.శ.253-277) రాజైన ఎహువల శాంతమూలుని సేనానియైన ఎలిశ్రీ ఏలేశ్వరం నిర్మించి, సర్వదేవాలయమనే శివాలయాన్ని నిర్మించాడు. ఆయన కాలంలో విజయపురిలో కార్తికేయ, పుష్పభద్ర స్వామి, నోడిగిరీశ్వర, దేవీ ఆలయాలు నిర్మితాలైనాయి. ఇక్ష్వాకుల కాలంలో మాతృకా దేవతారాధన కూడా ఉండేది. నాగార్జున కొండలోని హరీతి .
ఆలయంలో సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించే వారని శాసనాధారం. వీరికాలంలో స్కంద గణపతి, యక్షుడు, హరీతి దేవతలను పూజించేవారు. అనంతర వాకాట రాజులలో అధికులు శైవులు. మొదటి రుద్ర సేనుడు మహా భైరవుని భక్తుడు కాగా, మొదటి పృథ్వీసేనుడు మహేశ్వర భక్తుడు. క్రీ.శ.358 నుండి 569వరకు 210 ఏళ్ళు తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించిన విష్ణుకుండినులు నేటి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ (అమలపురం), నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలంలోని ఇంద్రపాల నగరం, కొంతకాలం బెజవాడను రాజధానిగా చేసుకున్నారు. వీరు బ్రాహ్మణ మతావలంబులు, శివభక్తులు. రెండవ మాధవవర్మ (క్రీ.శ.440 – 495) 100కు పైగా యుద్ధాలు చేసి, విజయాలు సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్టపైన ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. విజయం సాధించిన చోటల్లా రామలింగేశ్వర ఆలయం కట్టించాడు. శ్రీశైలం మల్లికార్జునునికి చంద్రగుప్తుడు అనే రాజు బంధువైన చంద్రవతి ప్రతిష్ఠించినదని చెపుతున్న గుప్త మహేశ్వర ఆలయ శిథిలాలు, నేటికీ శ్రీశైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వరానికి ఉత్తరాన ప్రతాప రుద్ర కోటకింద వాయవ్య మూలన రోడుకు దక్షిణాన ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినుల కాలంలోనే బహుళ ప్రచారం పొందాడు. గోవింద వర్మ అనేక దేవాలయాలు కట్టించాడు. 2వ మాధవ వర్మ అనేక రామ లింగేశ్వరాలయాలు కట్టించాడు. గుంటూరు జిల్లా లోని సత్తెనపల్లి తాలూకా వేల్పూరులో, కీసరగుట్టలో రామలింగే శ్వరాలయాలు నేటికీ దర్శనీయ స్థలాలే. తూర్పు చాళుక్య 2వ విజయాదిత్యుడు 108 విజయాలకు గుర్తుగా 108 భీమేశ్వరాలయాలు నిర్మించాడు. జైన మతం విష్ణుకుండినుల కాలంలోనే దాదాపు కనుమరుగు కాగా, జైన ఆలయాలు శివాలయాలైనాయి. అలంపురం విష్ణుకుండినుల కన్నా ముందువారైన ఇక్ష్వాకుల నుంచే మనుగడలో ఉండేదని శాసనా ధారంగా ఉంది. వేములవాడ చాళుక్యులు, వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం తెలంగాణలోని ప్రముఖ శివాలయం. బద్దెగ (క్రీ.శ.850 – 895) వేములవాడలో బద్దిగేశ్వర (భీమేశ్వర) ఆలయాన్ని నిర్మించాడు. క్రీ.శ.7వ శతాబ్ది శాసనంలో శివమండల దీక్ష ప్రసక్తి ఉంది. శ్రీశైలం, అలంపురం, బెజవాడ, పిఠాపురం నాటి శక్తి పూజా కేంద్రాలు.
బసవేశ్వరుడు వీర శైవోద్యమాన్ని ప్రారంభించాడు. అనంతరం మల్లికార్జున పండితుడు శైవాన్ని ప్రచారం చేశాడు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం నిర్మిం చాడు. భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్య నిర్మాణాలే. యుద్ధ మల్లుడు బెజవాడలో కుమారస్వామి, 2వ విక్ర మాదిత్యుని భార్య మహాదేవి, పట్టడకల్‌లో శివాలయాన్ని నిర్మిం చారు. రాష్ట్రకూటుల కాలంలో ఎల్లోరా గుహలు మలుచ బడ్డా యి. కైలాసనాథ ఏకశిలాలయం మొదటి కృష్ణుని అద్భుత సృష్టి.
కాకతీయులు కాకతి మాతదేవతారాధకులుగా అభిప్రాయాలున్నాయి. గ్రామదేవతయైన ఏకవీర ఆరాధన నాడు బహుళ ప్రచారంలో ఉంది. వీరికాలంలో జైన బౌద్ధ, వీరశైవుల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఇందుకు భిన్నంగానే తిక్కన హరిహర తత్వాన్ని బోధించాడు. కాళేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసింది 2వ ప్రోలరాజు గురువైన రామేశ్వర పండితుడు. కాకతీయ పరిపాలనలో ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నందికంది, శనిగరం, పుష్పగిరి, అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం గొప్ప శైవక్షేత్రాలు. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో కాకతీ యుల కాలంలో 5500 శివాలయాలు, 1300 వైష్ణవాలయాలు, 2400 మల్లారదేవుని గుళ్ళు…భైరవ, దుర్గ గణపతి దేవుళ్ళవి కలిపి 4400 గుడులు ఉండేవని స్పష్టమవుతున్నది. వెలమరాజుల కాలంలో కాళిక, దుర్గ, చండి, భద్రకాళి, మహిషాసుర మర్దిని, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకవీర దేవతల ఆరాధన ఉన్నట్లు తెలుస్తున్నది.

రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494

Advertisement

తాజా వార్తలు

Advertisement