Saturday, April 27, 2024

యంగ్ లీడ‌ర్స్‌.. దావోస్‌ వేదికగా ఏపీ సీఎం జగన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప‌ర‌స్ప‌రం ఒకే వేదిక‌పై భేటీ అయ్యారు. ఈ అరుదైన కలయికకు దావోస్‌ వేదికైంది. ఈ సందర్భంగా ఈ యంగ్ లీడ‌ర్లిద్ద‌రూ ఆప్యాయంగా ఒక‌రినొక‌రు పలకరించుకున్నారు. కాగా దీనిపై ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేతలిద్దరు ఏయే అంశాలపై చర్చించారన్న అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్‌ జగన్‌ వరుసగా సమావేశం అవుతున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

మరో వైపు మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణకు పెట్టుబడుల ఆహ్వానం విషయంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు లూలు గ్రూపు అధిపతి యూసుఫ్‌ అలీ ప్రకటించారు. అలాగే స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్యాంకింగ్‌, ఫైనా న్స్‌, బీమా రంగ సంస్థ స్విస్‌రీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. స్పెయిన్‌కు చెందిన బహుళజాతి సంస్థ కీమో ఫార్మా హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్టు వెల్లడించింది. ఈ-కామర్స్‌ సంస్థ ‘మీషో’ హైదరాబాద్‌లో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement