Wednesday, May 8, 2024

AP: ఫ్రిడ్జ్ షాక్ తో.. ఒకరు దుర్మరణం

అనంత‌పురం: ఫ్రిడ్జ్ ను ముట్టుకోవ‌డంతో ఒక‌రు దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు తీసుకోవడానికి ఫ్రిడ్జ్ డోర్ పట్టుకున్నాడు బాషా అనే వ్యక్తి.. దీంతో.. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు.. వెంటనే కుటుంబ సభ్యులు బాషాను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేక‌పోయింది.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

కాగా, ఈ మధ్యే ఐస్‌క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లిన చిన్నారి.. అక్కడి ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్‌క్రీం తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. ఫ్రిడ్జ్ ను పట్టుకుని విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లో ఈ నెలలోనే జరిగింది.. బోధన్‌ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడూరు రాజశేఖర్‌ నందిపేట్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు.. అయితే, అతని కుమార్తె నాలుగేళ్ల రిషిత ఐస్‌క్రీం కావాలని మారాం చేసింది.. దీంతో.. నందిపేట్‌లోని ఎన్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లారు.. తండ్రి ఒక ఫ్రిడ్జ్ లో వస్తువులు చూస్తుండగా.. మరో ఫ్రిడ్జ్ ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకోవడం.. విద్యుదాఘాతానికి గురై అక్కడే బిగుసుకుపోయి ప్రాణాలు విడిచింది ఆ చిన్నారి.. ఇప్పుడు అనంతపురం జిల్లాలోమరో ఘటన చోటు చేసుకోవడంతో.. ఫ్రిడ్జ్ లను పట్టుకుంటే కరెంట్‌ షాక్‌ ఎలా కొడుతుందేమోన‌ని ఆందోళన మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement