Saturday, May 25, 2024

పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలి.. కేంద్రానికి ఎంపీ విజయసాయి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులు తగ్గించి సెస్‌ రూపంలో చేస్తున్న వసూళ్ళలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాటా ఇవ్వాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నాయని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలను ప్రభుత్వం ఇందుకు సాకుగా చూపిస్తున్నా వాస్తవం వేరన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేళ్ళలో పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర పన్నులు మూడు రెట్లు పెరిగాయని, 2014లో వినియోగదారుడు లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.48 పైసలు పన్నుగా చెల్లిస్తే ఇప్పుడది రూ.27.90 పైసలకు పెరిగింది. మొత్తం మీద 2014-15 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పాదనలపై 1 లక్షా 15 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా వసూలు చేయగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆ మొత్తం 3 లక్షల 72 వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆయన వివరించారు. అంటే పెట్రోలియం ఉత్పాదనలపై కేంద్ర పన్నులు 223 శాతం పెరిగాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పాదనలపై పన్నులు, సెస్‌లను ఎడాపెడా పెంచుకుంటూ పోతూ మరోవైపు పెట్రోల్‌పై విధించే వ్యాట్‌ను తగ్గించాలంటూ అనేక సందర్భాలలో రాష్ట్రాలకు విజ్ఞప్తులు చేస్తోంది. పెట్రోల్‌పై టాక్స్‌ రూపంలో వచ్చే ప్రతి 100 రూపాయల ఆదాయంలో కేవలం 2 రూపాయలను మాత్రమే రాష్ట్రాలకు ఇస్తున్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుండా దాటవేస్తోందని విజయసాయి అన్నారు. పెట్రోల్‌పై విధంచే పన్నులలో రాష్ట్రాలకు వాటా దక్కకుండా చేసేందుకు సెస్‌ల రూపంలో భారీగా వసూళ్ళు చేస్తోంది. సెస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచవలసిన అవసరం లేనందునే కేంద్ర ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుందని ఆయన చెప్పారు. గడచిన అయిదేళ్ళలో పెట్రోలియం ఉత్పాదనలపై విధించిన సెస్‌లు 56 శాతం నుంచి 95 శాతానికి పెరిగింది. వివిధ కారణాల వలన గణనీయంగా తగ్గిపోతున్న ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాలు పెట్రోల్‌పై వ్యాట్‌ను విధించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడిందని ఎంపీ తెలిపారు. కస్టమర్లపై మోపిన భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్‌పై పన్నులను పునఃవ్యవస్థీకరించాల్సిన అవసరముందని, పెట్రోలియం ఉత్పాదనలపై విధించే పన్నుల్లో రాష్ట్రాలకు సమాన పద్దతిలో వాటా ఇవ్వాలని నొక్కి చెప్పారు. పెట్రోల్‌పై విధించే పన్నులను తగ్గించేందుకు, సెస్‌ల రూపంలో వసూలు చేసే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజయసాయి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement