Saturday, April 27, 2024

కోవిడ్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలు

శ్రీకాకుళం : కోవిడ్ కేర్ కేంద్రాల్లో వినోద కార్యక్రమాలను తాజాగా నిర్వహిస్తున్నారు. పాత్రునివలస కేంద్రంలో 817 మంది కోవిడ్ బాధితులు ఉండటంతో వాళ్లందరికీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ప్రతిరోజు యోగా నిపుణులు డాక్టర్ చిలుక లక్ష్మీ కాంత్ నేతృత్వంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుండగా తాజాగా వినోద కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా జానపద కళారూపాలు – బుర్రకథ కార్యక్రమంతో దీన్ని ప్రారంభించారు. కోవిడ్ కేర్ కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ చక్కటి పర్యవేక్షణ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. మంచి వైద్యసేవలు, తాగునీరు, పారిశుద్ధ్యం కల్పిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతోంది. దీంతోపాటుగా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన మానసిక వినోదం పొంది కోవిడ్ అనే భావన నుండి బయటకు వచ్చి దృఢంగా మారగలరు. కోవిడ్ బాధితులు అనే ఆలోచనతో ఉండకుండా వినోద కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నాయి. వినోద కార్యక్రమాలుగా నిర్వహిస్తున్న కళాజాత కార్యక్రమంలో చారిత్రక అంశాలతోపాటు సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రస్తావిస్తూ కళా బృందాలు చక్కగా వివరిస్తున్నాయి. కోవిడ్ కూడా సాధారణ జ్వరం వంటిదేనని మనం జాగ్రత్తగా ఉంటే మన దారికి చేరదని వివరించడం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ మాస్కు వదల రాదని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచాలని సూచిస్తున్నారు. గత ఏడాది కూడా కళజాత కార్యక్రమాలు నిర్వహించి కోవిడ్ కేర్ కేంద్రంలో కోవిడ్ బాధితులు సాధారణ జీవితం గడిపే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేసింది. ఈ ఏడాది జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశాలకు అనుగుణంగా మరల చేపట్టినట్లు నోడల్ అధికారి కె.రవి కుమార్ తెలిపారు. బుధవారం నర్సుల దినోత్సవం కూడా నిర్వహించి పనిచేస్తున్న నర్సులకు మీతో మేమున్నాం అనే భరోసాను కల్పించామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement