Sunday, April 28, 2024

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు ఎపిలో అరాచ‌కం సృష్టిస్తున్నారు – స‌జ్జ‌ల

తాడేప‌ల్లి – జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషికొండలో పవన్ కల్యాణ్ విన్యాసాలు చేశారని ఎద్దేవా చేశారు. ‘‘చంద్రబాబు, పవన్.. ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. చట్టాలను పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు.. అరాచక శక్తుల మూక” అని విమర్శించారు.

సోమవారం తాడేపల్లిలో మీడియాతో సజ్జల మాట్లాడుతూ. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు.. అప్పుడు వద్దన్న సీబీఐని ఇప్పుడు కావాలంటున్న చంద్ర‌బాబుని ప్రజలు పిచ్చి వాళ్లని అనుకుంటున్నారని అన్నారు… పవన్‌కు అవసరమైన అరేంజ్‌మెంట్స్‌ను చంద్రబాబు చేస్తున్నార‌ని, దీంతో రిషికొండలో పవన్‌ విన్యాసాలు చేశార‌న్నారు. త‌న యజమాని డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ అహంకారంతో వ్యవహరిస్తున్నార‌ని విమ‌ర్శించారు..

ప్రభుత్వంపై పద్దతి ప్రకారం బురదజల్లే ప్రయత్నం జరుగుతోంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపుతున్నారు. తమకు చట్టాలు, రాజ్యాంగం వర్తంచవన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వారు చేసే తప్పులు ప్రశ్నిస్తే మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. పుంగనూరులో పోలీసులపై టీడీపీ నేతలు దాడి చేశారు. పోలీసులు సంయమనం పాటించడంతో ముప్పు తప్పింది. ప్రచారం పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టించారు అంటూ స‌జ్జ‌ల మండి ప‌డ్డారు..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన అద్భుతంగా సాగుతోంది. సుమారు 90 శాతం ప్రజలకు సంక్షేమం అందుతోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రజలకు పథకాలు అందుతున్నాయి. పథకాలు అమలవుతున్న తీరుపై ప్రజల్లో సంతృప్తి ఉంది. మా పాలనపై మాట్లాడటానికి చంద్రబాబుకు అంశాలే లేవు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క మంచి పథకమైనా ఉందా?. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు అవసరం లేదని చంద్రబాబు చెప్పగలరా? అని ప్రశ్నలు సంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement