Saturday, April 27, 2024

నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహణ.. పార్టీ లీడర్లతో చంద్రబాబు సమీక్ష

అమరావతి: టిడిపి మహానాడు కార్యక్రమ నిర్వహణ వేదికపై క్లారిటీ వచ్చింది. ఒంగోలులోని మీని స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని మండువారిపాలెం రెవెన్యూ విలేజ్ పరిధిలో…. త్రోవగుంట ప్రాంతంలో 27, 28 తేదీల్లో మహానాడు జరగనుంది. మహానాడు నిర్వహణపై టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో మహానాడు నిర్వహణకు టిడిపి ఒంగోలులోని మినీ స్టేడియం ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. అయితే చివరి నిముషం వరకు నాన్చి…స్టేడియం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది.

దీంతో టిడిపి మొదట తాము పరిశీలించిన మండువారిపాలెం సమీపంలోని బృందావన్ ఫంక్షన్ హాల్ ప్రాంతంలోనే మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా దరఖాస్తు చేసుకున్నా.. అవసరం అయిన ఫీజులు చెల్లించినా ప్రభుత్వం స్టేడియం ఇవ్వకపోవడంపై టిడిపి మండి పడింది. స్టేడియం ఎందుకు ఇవ్వరు… ఇదేమన్నా వాళ్ల తాతగారి జాగిరా అంటూ నేతలు మండిపడ్డారు. నూతనత్వంతో, భావజాలం చాటేలా మహానాడు నిర్వహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర భవిష్యత్ కు టిడిపి అవసరాన్ని చాటేలా మహానాడు ఉండాలని ఆయన అన్నారు. మహానాడుకు సమయం దగ్గరపడుతున్న కారణంగా పనులు వేగవంతం చెయ్యాలని అధినేత సూచించారు. బుధవారం మహానాడు ప్రాంగణంలో పనులు ప్రారంభించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement