పోలీసుల్లో కొందరు మంచి పనులు, నడవడికతో ఇతరులకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంటారు. కానీ, ఇంకొంత మంది అయితే దీనికి ఫుల్ కాంట్రాస్ట్ అన్నమాట. చేయి తడవనిదే పనికాదన్నట్టు ఉంటుంది వీరి పనితీరు. అంతేకాకుండా ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో ఆ ఏరియాకి బాగా అలవాటు పడి.. అక్కడ్నించి సంవ్సత్సారాల కొద్దీ కదలకుండా ఫెవికాల్ బంధంలా అక్కడే ఉండిపోతున్నారు..
గుంటూరు క్రైo, (ప్రభన్యూస్): గుంటూరు రూరల్ పోలీస్ జిల్లాలో విదులు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు కొంతమంది నిబంధనలకు పాతర వేస్తూ ఏళ్లతరబడి ఒకే పోలీస్ స్టేషన్ లో పాతుకుపోయారు. ఆంద్రప్రదేశ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను ఐదు సంవత్సరాలకొకసారి బదిలీ చేస్తుంటారు. కానీ, రూరల్ పోలీస్ జిల్లా పరిధిలోని సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ కాలం నుంచి కొందరు కదలకుండా విధులు నిర్వహిస్తున్నారు. ఎందరో సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, వస్తున్నారు.. పోతున్నారు.. కానీ, వీరికి మాత్రం స్థానచలనం కలగకపోవడంతో సాటి సిబ్బంది సైతం అవాక్కవుతున్నారు.
అయితే వీరి గమ్మునుంటున్నారా అంటే అదికూడా లేదు. సీనియారిటీని అడ్డుపెట్టుకుని తోటి పోలీసుల విధులలో ఆటంకం కలగజేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు కోకొల్లలు. ఒకే పోలీస్ స్టేషన్ లో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించడంతో స్థానికులతో ఏర్పడిన సంబంధాల వలన కొన్ని సందర్భాల్లో తప్పు చేసిన వారికి, సహకరించడం వంటి ఘటనలూ ఉన్నాయి. గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ రూరల్ పోలీస్ జిల్లాలో అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలనుంచి అధికార, అనాదికార ప్రజాప్రతినిధులు, ఇతరశాఖల అధికారుల నుంచి తనదైన శైలిలో మన్నలను పొందారు. కానీ, సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలు దాటిన, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుళ్లను బదిలీ చేయకపోవడంపైనా విమర్శలు వస్తున్నాయి.
సత్తెనపల్లి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది ఇలాగే ఎనిమిదేండ్లు అయినా అదే పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తు్న తీరు కనిపిస్తోంది. మరి కొంతమంది హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కూడా అక్కడ విధులలో చేరి 5సంవత్సరాలు దాటి పోయింది. ఇప్పటికైనా స్థానికంగా పాతుకుపోయి పోలీసు వ్యవస్థకే మాయని మచ్చగా మారుతున్న వారిపై దృష్టి సారించాలని చాలామంది పోలీసు బాస్ని కోరుతున్నారు.