Sunday, May 19, 2024

AP | ఆ డీఎస్పీలు మళ్లీ సీఐలేనా.. 100 సూపర్‌ న్యూమరరీ పోస్టులు రద్దు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర పోలీసుశాఖలో ప్రస్తుతం కొనసాగుతున్న సూపర్‌ న్యూమరరీ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. సకాలంలో పదోన్నతులు లభించని ఇన్‌స్పెక్టర్ల కోసం డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సృష్టించిన ఈ విధానం ఇక రద్దయింది. రాష్ట్ర విభజన అనంతరం పోస్టుల సర్దుబాటులో భాగంగా తెలంగాణాలో ఖాళీల భర్తీ కోసం కొందరు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్లకు రెగ్యులర్‌ పదోన్నత ులకు బదులుగా ప్రాధాన్యత క్రమంలో ప్రమోషన్‌ల అవకాశం కల్పిస్తూ ఈ సూపర్‌ న్యూమరరీ పోస్టులను క్రియేట్‌ చేయడం జరిగిం ది. అదేమాదిరిగా ఇక్కడ కూడా విభజన ఫలితంగా ఏపీలో డిఎస్పీ పోస్టుల సర్దుబాటు కోసం కొందరు ఇన్‌స్పెక్టర్లకు డిఎస్పీ పదోన్నతుల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ సూపర్‌ న్యూమరరీ విధానం తీసుకువచింది.

దీని ప్రకారం అప్పట్లో దాదాపు 169 సూపర్‌ న్యూమరరీ డిఎస్పీ పోస్టులు సృష్టించింది. ఈ క్రమంలో 1989, 91, 95 బ్యాచ్‌లకు చెందిన పలువురు సీఐలు సూపర్‌ డిఎస్పీలుగా పదోన్నతి అందుకున్నారు. వీరిలో 91 బ్యాచ్‌కు చెందిన సీఐలే ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో సూపర్‌ పదోన్నతి పొందిన డిఎస్పీలు రెగ్యులర్‌ డిఎస్పీలు అయ్యారు. ఇలా సాధారణ పదోన్నతికి అర్హత సాధించిన వారిలో 56 మంది ఉన్నారు. మరి కొందరిని దిశ పోలీసు స్టేషన్లలో నియమించినా చాలామంది అప్రాధాన్యత పోస్టుల్లో కొనసాగుతున్నారు. సూపర్‌ డిఎస్పీలై ఆ తర్వాత సాధారణ పదోన్నతి అందుకున్న పలువురు డిఎస్పీలు ప్రస్తుతం వివిధ జిల్లాల్లో కీలక పోస్టుల్లో కొనసాగుతున్నారు.

ఉదాహరణకు అవనిగడ్డ, చీరాల, గన్నవరం వంటి సబ్‌ డివిజన్‌ అధికారులు ఈ కోవకు చెందిన వారే. అయితే మిగిలిన వంద మంది సూపర్‌ డిఎస్పీలు మాత్రం ఎక్కువ మంది లూప్‌లైన్‌లో ఉన్నారు. సబ్‌ డివిజనల్‌ అధికారిగా బాధ్యతలు నిర్వహించడానికి సూపర్‌ డిఎస్పీలు అర్హులు కారనే నిబంధన ఉంది.

- Advertisement -

ఆందోళన అవసరం లేదు..
గత ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్‌ న్యూమరరీ డిఎస్పీ పోస్టుల వల్ల 2009 బ్యాచ్‌తోపాటు ఆ తర్వాత వివిధ బ్యాచ్‌లకు చెందిన సీఐలకు చాలాకాలంగా పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. దాదాపు 15 సంవత్సరాల పాటు సీనియారిటీ ఉన్నప్పటికీ డిఎస్పీ ప్రమోషన్‌కు నోచుకోనందున వారిలో సూపర్‌ న్యూమరరీ పట్ల అసంతృప్తి చేసుకుంది. ఒక దశలో ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళిన దాఖలాలు ఉన్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. వీరి ఆవేదన సరైందని భావించిన ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పదోన్నతులను కల్పించే విధంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సూపర్‌ పోస్టులను రద్దు చేయాలని నిర్ణయించినందున ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదనలు పంపారు. దీంతో విశాఖ రేంజ్‌ పరిధిలో 17, ఏలూరు రేంజ్‌ పరిధిలో 26, గుంటూరు రేంజ్‌ పరిధిలో 15, కర్నూలు రేంజ్‌ పరిధిలో 40 ఇతర విభాగాల్లో రెండు పోస్టులను కలిపి మొత్తం 100 సూపర్‌ పోస్టులను రద్దు చేస్తూ డీజీపీ ఈనెల 5వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఇప్పటికే సూపర్‌ పదోన్నతి పొంది కొనసాగుతున్న ఇన్‌స్పెక్టర్లు రద్దయిన కారణంగా మళ్లీ సీఐలుగా కొనసాగాలా అన్న సందేహం నెలకొంది. ఈ నిర్ణయంపై పలువురు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పటివరకు డీఎస్పీ యూనిఫాం వేసుకుని ఇప్పుడు సీఐగా విధులు నిర్వహించాలంటే ఇబ్బందిగానే ఉంటుంద ంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల ఎ లా స్పందించాలని ఆలోచిస్తున్నారు. దీనిలో భాగం గా న్యాయసంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని, సూపర్‌ పోస్టులు రద్దయినా.. ఆ పదోన్నతిపై కొనసాగుతున్న వారిని రెగ్యులర్‌ చేసి సర్దుబాటు చేసే దిశగా పోలీసుశాఖ కసరత్తు చేస్తోందంటూ మరి కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కొంతమంది డిఎస్పీలు అదనపు ఎస్పీ పదోన్నతి కోసం నిరీక్షిస్తున్నారు.

ఆ ప్రక్రియ పూర్తయితే ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మరికొంతమంది సీఐలకు డిఎస్పీలుగా పదోన్నతి ఇవ్వాల్సి ఉంది. దీంతో వారితో పాటు సూపర్‌ డిఎస్పీలకు కూడా సర్దుబాటు చేసే యోచనలో పోలీసుశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం పదవివిరమణ రెండేళ్ళు పెంచడం వల్ల ఇప్పటికే రిటైర్డ్‌ కావాల్సిన అధికారులు ప్రస్తుతం సరీ ్వసులో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కొందరు 2024 నుంచి పదవి విరమణ చేయనున్నారు. దీంతో ఇంకా ఖాళీలు ఏర్పడే పరిస్ధితి ఈ నేపధ్యంలో పోలీసు శాఖలో సూపర్‌ న్యూమరరీకి శాశ్వతంగా స్వస్తి పలికి పదోన్నతుల ప్రక్రియ సాదారణంగా కొనసాగేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement