Sunday, May 12, 2024

నాన్నా రండి… నన్ను బయటకు తీయండి: కన్నీరు పెట్టిస్తున్న ఘటన

విశాఖపట్నంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు అందరి మనసులను కలచివేస్తుంది. బీఈడీ చదువుతున్న ఆ యువతి నాన్నా కాపాడండని ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన చూసిన వారందరితో కంటతడి పెట్టిస్తోంది.

వివరాల్లోకి వెళితే..విశాఖ ఎన్‌ఏడీ కూడలి దరి కాకాని నగర్‌ సమీపంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాక భవానీ నగర్‌ గీతా కుమారి (21) బీఈడీ చదువుతోంది. వెంకట్రావు తన కూతురిని ఎంవీపీ కాలనీలోని కళాశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా కాకానినగర్‌ వంతెన ఎక్కే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. వెంకట్రావు రోడ్డు అంచు వైపునకు పడగా, గీతాకుమారి బస్సు వెనక చక్రాల కింద పడిపోయింది. బస్సు వేగం నియంత్రణ కాకపోవడంతో ఆమెను కొంత దూరం ఈడ్చుకెళ్లడంతో నడుం భాగం బాగా దెబ్బతింది. ఆ సమయంలో తనకు ఏం జరిగిందో తెలియని గీతాకుమారి.‘‘నాన్నా రండి… నన్ను బయటకు తీయండి నాన్నా’’ అంటూ విలపించింది. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను నగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్న అక్కడి వైద్యుల సూచనతో కేజీహెచ్‌కు తీసుకువెళ్లగా… చికిత్స అందిస్తున్న సమయంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకట్రావుకు గాయాలయ్యాయి. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement