Tuesday, May 14, 2024

వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం … న‌లుగురు మ‌హిళా కూలీలు దుర్మ‌ర‌ణం..

వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామం శివారులో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను  తుఫాను వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదధాటికి శరీర భాగాలు తెగిపడ్డాయి. ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ములుగు నుంచి వరంగల‌ వైపు వస్తున్న తుఫాను వాహనం ఆటోను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. మృతులు మాడిశెట్టి సాంబలక్ష్మి (65), పాలకుర్తి సరోజన (55), మెహబూబీ (50)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో డ్రైవర్‌ సహా 19 మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఆత్మకూరు మండల కేంద్రం నుంచి దుగ్గొండి మండలం రంగాపురం గ్రామానికి మర్చి పంట కోసేందుకు ఆటోలో బయలుదేరగా ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి సంతాపం
వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలం నీరుకుళ్ల శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌ విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఇవాళ ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను తుఫాను వాహనం ఢీకొట్టింది. దీంతో న‌లుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడటం బాధాకరమని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడి.. ఘ‌ట‌న‌కు దారి తీసిన ప‌రిస్థితులు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాల‌కు త‌మ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వ ప‌రంగా ఆ కుటుంబాల‌ను ఆదుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement