Tuesday, May 14, 2024

కాంగ్రెస్ పార్టీ నీచపు బుద్ది మరోసారి బయటపడింది… ఎమ్మెల్యే ఆరూరి

కాంగ్రెస్ పార్టీ నీచపు బుద్ది మరోసారి బయటపడిందని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా హసన్ పర్తి మండల కేంద్రంలో రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ….రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అందిస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కి పెట్టిన రేవంత్ రెడ్డి నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడన్నారు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వివక్ష చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు కి రాబోయే ఎన్నికల్లో రైతులే కరెంట్ షాక్ ఇస్తారని పేర్కొన్నారు.

మొన్న ధరణి వద్దన్నారు, నేడు ఉచిత విద్యుత్ వద్దంటున్నారు, రేపు రైతు బందు, రైతు భీమా వద్దంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులు, ప్రజలు ఆలోచించాలన్నారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి వేంటేనే క్షమాపణ చెప్పాలన్నారు. రేపు, ఎల్లుండి అన్ని మండల కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement