Monday, May 20, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి.. రోడ్డు బాగాలేక‌నే చ‌నిపోయార‌ని ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామ‌స్తులు

వికారాబాద్, ప్రభ న్యూస్: వికారాబాద్ జిల్లాలోని కొత్తగుడిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వికారాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చ‌నిపోయారు. దీంతో కోపోద్రిక్తులైన మృతుల గ్రామానికి చెందిన వారు రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు. వికారాబాద్- సదాశివపేట మార్గంలో పూర్తిగా రోడ్డును దిగ్బంధించి వాహనాలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఘటనా స్థలానికి వెళ్లి ప‌రిస్థితిపై ఆరా తీశారు. ఈ క్ర‌మంలో ఆగ్రహించిన నారాయణపురం గ్రామస్తులు ఎమ్మెల్యేను అక్క‌డి నుంచి క‌ద‌ల‌కుండా అడ్డుకున్నారు. రోడ్డు బాగా లేని కారణంగానే ఇద్ద‌రు చ‌నిపోయార‌ని మండిప‌డ్డారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తప్పనిసరిగా రోడ్లు బాగు చేయిస్తాన‌ని వారికి న‌చ్చ‌జెప్పారు. ఇంత‌లో పోలీసులు వ‌చ్చి ఆందోళ‌న‌కారుల‌ను స‌ముదాయించి ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement