Monday, May 6, 2024

ఆర్టిజన్లకు ఊరట.. తిరిగి విధుల్లోకి తీసుకున్న ప్ర‌భుత్వం.. జ‌గ‌దీష్ రెడ్డి

సూర్యాపేట : విధులకు గైర్హాజరై విధుల్లో నుండి తొలగించబడిన ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. వాస్తవానికి ఔట్ సోర్సింగ్ పేరుతో విధులు నిర్వర్తిస్తున్న ఆర్టిజన్లను దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఅర్ మానవతా దృక్పథంతో క్రమబద్దీకరించిన నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అదే మానవీయ కోణంలోనే 196మంది ఆర్టీజన్ల‌ను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మె పేరుతో విధులకు గైర్హాజరైన 196 మంది ఆర్టీజన్లను విధుల్లో నుండి శాశ్వతంగా తొలగిస్తూ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

దీంతో ఆర్టిజన్ల సంఘాల తరఫున మలక్ పేట శాసనసభ్యులు అహ్మద్ అబ్దుల్లా బలాల ఆద్వర్యంలో ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులు మంగళవారం ఉదయం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ట్రాన్స్ కో & జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు, టీ యస్ యస్ పీడీసీయల్ సీ ఎండీ రఘుమా రెడ్డిలతో చర్చలు జరిపారు. మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్లా బలాల అభ్యర్ధన మేరకు సానుకూలంగా స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టిజన్ల‌ను మానవీయ దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయలో ఈ తరహ సంఘటనలు పునావృతం కాకూడదని మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టిజన్ సంఘాల ప్రతినిధులకు సూచించారు. పునరావృతమైతే ఉపేక్షించేది లేదని ట్రాన్స్ కో & జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement