Sunday, May 19, 2024

TS | బీజేపీవీ అన్ని మత రాజకీయాలే.. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుతాయి : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మార్పు బాగుందా.. బాగాలేకపోతే కాంగ్రెస్‌ పార్టీని చీరి చింతకు కట్టేయాలే.. రేవంత్‌ రెడ్డి భాషలో చెప్పాలంటే ఆయన లాగుల తొండలు జొర్రకొట్టాలే అని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. బీసీలకు దమ్ముంటే గెలిపించుకోవాలని కాంగ్రెస్‌ వాళ్లు సవాల్‌ చేస్తున్నారని వెల్లడించారు. సోమవారం చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో పాల్గొన్న కేటీఆర్‌.. బలహీన వర్గాల ముద్దబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు.

96 బీసీ కులాలను ఒక్కటి చేసిన బీసీ గొంతు కాసాని అని స్పష్టం చేశారు. బీసీలకు దమ్ముంటే గెలిపించుకొండి అని ఓ కాంగ్రెస్‌ నాయకుడు అంటున్నాడు. మరి బీసీలు అంత కలిసి ఆ కాంగ్రెస్‌ నాయకుడికి బుద్ధి చెప్పేలని కేటీఆర్‌ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకొని బీసీలు సత్తా చాటాలని స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డిలాగా తనకు ఆ భాష రాదు గానీ తప్పటం లేదు మాట్లాడాల్సి వస్తోందంటూ వెల్లడించారు.

మహిళలకు రూ.2500, ఇంట్లో పెద్ద మనుషులు ఇద్దరికీ 4 వేలు అన్నాడు. తులం బంగారం, స్కూటీలని రేవంత్‌ అన్నాడు. వచ్చినయా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుండే అని అనుకునేటోళ్లకు మంచి ఉపాయం చెబుతా. మీరు చేయాల్సిదల్లా ఒక్కటే. 13 మే నాడు కారు గుర్తు మీద ఓటు వేయండి. 10-12 సీట్లు మాకు అప్పగించండి. 6 నెలల్లో కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు.

ఈ కరెంట్‌ బాధలు, నీళ్ల భాదలు పోవాలన్న.. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చేయాలంటే ఆ పార్టీని ఓడించాలన్నారు. అరచేతిలో వైకుంఠం చూపి గెలిచిండు. ఇప్పుడు అవతల పడ్డాడు. లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చినా అని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. మరి లంక బిందెలు కోసం వెతికేది దొంగలు కదా? మెడలో పేగుల వేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అట్ల మాట్లాడుతాడా? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా అంటాడు? పిచ్చోని చేతిలో రాయిలా అయిపోయింది తెలంగాణ పరిస్థితి అని కేటీఆర్‌ వెల్లడించారు.

- Advertisement -

రేవంత్‌ బీజేపీ మనిషే.. లోపాయికారి ఒప్పందం

ప్రధాని నరేంద్ర మోడీ మళ్లి అధికారంలోకి వస్తే అన్ని పిరం అవుతాయని కేటీఆర్‌ అన్నారు. ఈ సారి బీజేపోళ్లు 400 సీట్లు అంటున్నారు. వాళ్లకు 400 సీట్లు వస్తే పెట్రోల్‌ 400 చేస్తారని వెల్లడించారు. 2014లో నమో అనేటాయన వచ్చిండు. నమో అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తి? రూ. 15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు. ఆయన చెప్పిన ఒక్క హామీ అయినా అయ్యిందా? ఎవరికైనా రూ. 15 లక్షలు వచ్చినయా? మోడీకి చేసిన పని చెప్పే దమ్ము లేదు.

అందుకే గుడికట్టినం అని చెప్పి రాజకీయాలు చేస్తుండు. అన్ని ధరలు పెంచిండు. అందుకే మోడీని మహిళలంతా పిరమైన మోడీ అంటున్నారు. కేసీఆర్‌ ఎప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయలేదు. మనిషిని మనిషిగా, పేదోళ్లను పేదోళ్లుగా చూసి వారికి మంచి చేయాలని పని చేసిండు. కానీ బీజేపీ మాత్రం మతం పేరుతో రాజకీయాలు చేస్తోంది. ఆయనకు అనుకూలంగా ఇక్కడ రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నాడు.

ఊరికే ఈ మాటలు చెప్పటం లేదు. రాహుల్‌ గాంధీ ఏమో మోడీని చౌకి దార్‌ చోర్‌ అంటే మోడీ బడే భాయ్‌ అని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. రాహుల్‌ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్‌ హై అంటే… అదానీ హమారా ఫ్రెండ్‌ అంటున్నాడు. రాహుల్‌ గాంధీ గుజరాత్‌ మోడల్‌ ఫేక్‌ మోడల్‌ అంటే రేవంత్‌ రెడ్డి మాత్రం తెలంగాణను గుజరాత్‌ మోడల్‌ చేస్తా అంటాడు. లిక్కర్‌ స్కాం లేదు కేజ్రీవాల్‌ ను అరెస్ట్‌ చేయటం సరికాదు అని రాహుల్‌ గాంధీ అంటే.. కేసీఆర్‌ కూతురు ను అరెస్ట్‌ చేయటం కరెక్టే అని రేవంత్‌ అంటున్నడు.

లిక్కర్‌ స్కాం జరిగిందని రేవంత్‌ రెడ్డి అంటాడు. లోక్‌ సభ ఎన్నికల తర్వాత కచ్చితంగా రేవంత్‌ రెడ్డి బీజేపీలో చేరటం ఖాయం. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వెళ్తుంది. అన్ని వర్గాల ప్రజల కోసం కేసీఆర్‌ ఎంతో చేసిండు. అందరి బతుకులు సంతోషంగా ఉండాలని కేసీఆర్‌ కోరుకున్నారు. అలాంటి కేసీఆర్‌ని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపోళ్లు వచ్చి మేము గుడికట్టినం అంటారు.

మరి కేసీఆర్‌ యాదాద్రి కట్టలేదా? ఒక్క యాదాద్రి మాత్రమే కాదు.. ఆధునిక దేవాలయాలైన కాళేశ్వరం సహా ఎన్నో రిజర్వాయర్లు కట్టిండు. దేవుళ్లు దేవుళ్లే.. రాజకీయాలు రాజకీయాలే. దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పాలె. రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం రియల్‌ ఎస్టేట్‌ పని ఖతం అయిపోయింది. వీళ్లకు ఉన్న కంపెనీలను కాపాడుకునే సోయి లేదు. కొత్త కంపెనీలు తెచ్చే సత్తా లేదంటూ కేటీఆర్‌ విరుచుకుపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement