Tuesday, April 30, 2024

Kamareddy: అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జితేష్ వి పాటిల్

కామారెడ్డి, అక్టోబర్ 26 (ప్రభ న్యూస్) : ఎన్నికల కమిషన్ నియమావళి మేరకు వివిధ రాజకీయ పార్టీల ప్రకటనలకు సంబంధించి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుండి ముందస్తుగా అనుమతి పొందిన వాటినే ప్రసారం, ముద్రణ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం నందు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… ఛానళ్లలో ప్రసారాలకు, ప్రింట్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి ముందస్తుగా అనుమతి పొందకుండా ప్రచురించడం, ప్రసారం చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు వస్తుందని, ఆ ఖర్చును అభ్యర్థి పేర చూపించడం జరుగుతుందన్నారు. నామినేషన్ వరకు ఖర్చును ఆయా పార్టీల ఖాతాలో, నామినేషన్ వేసినప్పటి నుండి అభ్యర్థి ఖర్చు క్రింద చూయించడం జరుగుతుందన్నారు. అభ్యర్థి పేర వారి అనుచరులు ఖర్చు చేసిన ఆ ఖర్చు అభ్యర్థి ఖాతాలో చూయించడం జరుగుతుందని, ఒక వేళ అభ్యర్థి సమ్మతించకుంటే పబ్లిషర్ పై చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు.

ప్రకటనలకు సంబంధించిన స్క్రిప్ట్, వీడియో, ఖర్చు, తదితర వివరాలను నిర్ణీత దరఖాస్తు ఫారం వెంట సమర్పించాలని, వాటిని పరిశిలించి ఎంసీఎంసీ కమిటీ ఆమోదం తెలుపుతుందన్నారు. అనుమానిత చెల్లింపు వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో బల్క్ ఎస్ఎంఎస్ లు, వాయిస్ మెసేజీలు, సినిమా హాళ్లలో, రేడియోలలో ప్రకటనలకు సంబంధించి ముందస్తుగా అనుమతి పొందాలని సూచించారు. అదేవిధంగా నిబంధనలననుసరించి ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించేటప్పుడు తప్పనిసరిగా అనుమతి పొందాలని సూచించారు. వాటిపై ప్రింటర్, ప్రచురణ కర్త పేరు, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్, ప్రతుల సంఖ్యతో పాటు ప్రింటింగ్ చార్జీల వివరాలను, ముద్రితమైన ప్రచార సామాగ్రి, పబ్లిషర్ ఇచ్చిన డిక్లరేషన్ కాపీని సమర్పించాలని సూచించారు.

అసత్య వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వచ్చిన మెస్సేజ్ లో వాస్తవం గ్రహించి నిర్దారణ చేసుకోవాలని సూచించారు. పోలింగ్ కు 2 రోజుల ముందు సైలెన్స్ పీరియడ్ చాలా కీలకమని న్యూస్ రిపోర్టింగ్ లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్దిష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు నడుచుకోవాలన్నారు. సభలు, సమావేశాలకు, లౌడ్ స్పీకర్ లకు, వాహనాలకు ముందస్తుగా అనుమతి పొందాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం నిరంతరం పర్యవేక్షిస్తుందని, సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చని, ఎన్నికలకు సంబంధించి ఏదేని సమాచారం కోసం 1950 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో నోడల్ అధికారులు కిషన్, సింహరావు, శాంతి కుమార్, సతీష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement