Tuesday, May 14, 2024

ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలి

జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీని ప్రత్యేక మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం ఉదయం స్థానిక బిఆర్‌ రెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఏర్పాటు కమిటీ నాయకులు మాట్లాడుతూ… బాదేపల్లి , జడ్చర్ల పట్టణాలను కలుపుతూ ప్రభుత్వం జడ్చర్ల మున్సిపాలిటీని ఏర్పాటు చేసిందని , కానీ కావేరమ్మపేట ప్రజలకు న్యాయం జరగదని హై కోర్టును ఆశ్రయించామని అన్నారు. జడ్చర్ల ను బాదేపల్లి లేకుండా మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. గత యేడాది కావేరమ్మపేటకు చెందిన నాయకులు పాలాది రామ్మోహన్‌ , చింతకాయల పెంటయ్య , మహేష్‌ గౌడ్‌లు ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పాటు కొరకు కోర్టులో పిటిషన్‌ వేయగా న్యాయస్థానం ఇటీవల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు జారీ చేసిందని అన్‌నరు. తమను ప్రత్యేక మున్సిపాలిటీగా కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డిని కలవడం జరిగిందని , తమకంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలను కూడా మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌ తమ గ్రామ ప్రజల మనవిని విని ప్రత్యేక మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్‌ కమిషన్‌ సునితకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు , రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కొంగలి జంగయ్య , మార్కెట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి , మాజీ ఎంపిపి నిత్యానందం , మాజీ ఉప సర్పంచ్‌ డి.శ్రీనివాసులు , మాజీ వార్డు సభ్యులు , వై.జి. ప్రీతమ్‌ , జగదీశ్వరాచారి , విజయభాస్కర్‌ రెడ్డి , యాసర్‌ , గడ్డం సాగర్‌ , కాశీ విశ్వనాథ్‌ , ఖాజామైనుద్దీన్‌ , యాదిరెడ్డి , నాగరాజు , కొంగలి నాగరాజు , రూబెన్‌ , శ్యామ్‌ సుందర్‌ , పిట్టల నరేష్‌ , అంజి , శశికిరణ్‌ , తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement