Friday, April 26, 2024

దృష్టి లోపం లేని తెలంగాణే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి పువ్వాడ

ఖమ్మం : దృష్టి లోపాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండవ విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పోరేషన్ 14వ డివిజన్ లోని జెడ్పి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ జనవరి 19వ తేదీన లాంఛనంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నదని, జూన్ వరకు నిర్వహించే రెండవ విడుత కంటి వెలుగులో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉన్న వైద్య బృందాలు పర్యటించి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. కంటి వెలుగు వైద్య శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, శిబిరాలకు వచ్చిన ప్రజలకు వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి వారికున్న దృష్టిలోపాన్ని బట్టి రీడింగ్‌ గ్లాసులను పంపిణీ చేస్తున్నారన్నారు. దూరపు చూపు సమస్య ఉన్న వారికి కండ్లద్దాలను ఆర్డర్‌ ఇచ్చి వచ్చిన తరువాత పంపిణీ చేస్తున్నారని, వీటితో పాటు విటమిన్‌ ఏ,డీ,బీ కాంప్లెక్స్‌ మాత్రలు, కండ్లల్లో వేసుకోవడానికి చుక్కల మందును అందజేస్తున్నారన్నారు. శిబిరాలు నిర్వహిస్తున్న ప్రతి చోట ప్రజలు కంటి పరీక్షలు చేయించుకుంటున్నారని, ఎవ్వరూ దృష్టిలోపం లేకుండా మంచు చూపుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా కళ్ళఅద్దాలను పంపిణీ చేశారు. అనంతరం DM & HO మాలతీతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణ వివరాలు అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, సుడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా, కూరాకుల వలరాజ్, దేవభక్తిని కిషోర్ బాబు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement