Tuesday, May 14, 2024

స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుందాం : మంత్రి పువ్వాడ

76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నందు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం వలన మనకు స్వాతంత్రం వచ్చిందని, అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వేడుకలకు విచ్చేసిన స్వాతంత్య్ర సమరయోధులకు, పుర ప్రముఖులకు, ప్రజా ప్రతినిధులకు, అధికార, అనధికారులకు, పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు పాత్రికేయ మిత్రులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76లోకి అడుగుపెడుతున్న వేళ 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా 15 రోజుల పాటు పండుగ వాతావరణం తలపించేలా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఎందరో వీరులు అలుపెరుగని పోరాటం చేస్తేనే నేటి మన స్వాతంత్ర్యం సిద్ధించిందని, మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు ఎందరో వీరులు వదిలిన తుది శ్వాసల ఫలితమే అన్నారు. మాన్యుల నుండి సామాన్యుల వరకు ఏక దీక్షతో సాగించిన ఉద్యమ కారణంగానే పరాయి పాలన అంతమైందని, దేశభక్తుల త్యాగం చిరస్మరనీయమన్నారు. ఈ సందర్భంగా ఆ మహానీయులను తలచుకోవడం, వారి బాటలో నడిచేందుకు మనమందరం కంకణబద్ధులై ఉండాలని, వారి స్పూర్తితో మనమందరం ముందుకు సాగుదామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. ఇదే స్ఫూర్తితో, సేవాభావంతో పరిపాలన దక్షతతో ముందుకు సాగుతూ జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిద్దామన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యమ్రాల గురించి మీకు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement