Saturday, April 27, 2024

భయం గుప్పిట్లో మెట్‌పల్లి..

మెట్‌పల్లి : పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అతి వేగంగా కొనసాగుతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటు-ంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో పట్టణంలో భయాందోళన నెలకొంది. ప్రజలు జాతరలు, విందులు వినోదాల్లో విచ్చలవిడిగా పాల్గొంటూ కరోనా వైరస్‌ వ్యాప్తికి కారకుల వుతున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిని అదుపు చేయకపోవడంతో వైరస్‌ వ్యాప్తి మరింత పెరుగుతుంది. పట్టణంలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నా వైద్యారోగ్య శాఖ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. టీ-కాపై, ముందు జాగ్రత్త చర్యలుగా భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శాని-టైజర్‌ వాడకంపై జనం పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా మాస్కులు ధరించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ వ్యాప్తికి కారణమవుతన్నారు. అయితే గత వారం రోజుల నుండి ప్రతి రోజూ 20 నుండి 27 కేసులు నమోదుకాగా ఒకరు కరోనాతో మరణించారు. క్రమంగా కేసులు పెరుగుతున్నా వైద్యారోగ్య శాఖ మాత్రం నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

పాజిటివ్‌ వచ్చినా.. ప్రజల్లో తిరుగుతూ..
పట్టణంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునే ప్రజలు నిర్ధారణ కోసం వైద్యులకు తప్పుడు పేర్లతో సమాచారం అందించి కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగితే ఆరోగ్య కార్యకర్తలు సమాచారం కోసం ఫోన్‌లో సంప్రదిస్తే తప్పించుకునేందుకు తప్పుడు అడ్రస్‌ చెబుతున్నారని ఆరోపణలున్నాయి. పట్టణానికి చెందిన ఓ యువకుడు ఇలా తప్పుడు సమాచారం అందించడంతో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా ఆ విషయం చెప్పకుండా అందరితో కలివిడిగా ఉండి ఓ మహిళ మరణానికి దారి తీసేందుకు కారణమయ్యాడు. సదరు గృహంలో నివాసం ఉండే 12 కుటుంబాలలో ఒక్కొక్కరికి దశల వారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అలాగే పలు వ్యాపార యజమానులకు, అందులో పని చేసే వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ జరిగితే ఆ వ్యాపార సముదాయాలను మూసివేసి క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలున్నప్పటికీ పట్టించుకోకుండా వ్యాపారస్తులు యధావిధిగా వ్యాపారాలను సాగిస్తున్నారు. తద్వారా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతుందని పలువురు చర్చించుకుంటు-న్నారు.

పట్టించుకోని అధికారులు..
పాజిటివ్‌ కేసులను కప్పిపుచ్చుకుంటూ వైరస్‌ వ్యాప్తి కారణమవుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన వైద్య ఆరోగ్య, మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు- వ్యవహరిస్తున్నార నే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్‌ రవి వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని, ప్రత్యేక బృందాలతో కరోనా నివారణకు కృషి చేయాలని సూచించారు. పాజిటివ్‌ వచ్చిన వారిని, వారి కుటు-ంబాలు హోం క్వారెంటెన్‌లో ఉండేలా అవగాహన కల్పించాలని, పాజిటివ్‌ వచ్చిన వారి ఇంటి చుట్టు-పక్కల పరిసరాల్లో శానిటైజర్‌ చేయాలని, మాస్క్‌ ధరించకుండా విచ్చలవిడిగా తిరిగే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయినా అధికారులు మాత్రం కలెక్టర్‌ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకు వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు అవగాహన కల్పించి, వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement