Friday, April 26, 2024

ఈనెల 9న మన బస్తి – మన బడి పనుల ప్రారంభం : మంత్రి తలసాని

ఈనెల 9న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి – మన బడి పనులు ప్రారంభమ‌వుతాయ‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మన బస్తి – మన బడి కార్యక్రమం అమలుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, విద్యాశాఖ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి రూ.7,289.54 కోట్లను కేటాయించిందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతగా 239 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోలేదన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయ‌న్నారు. పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధుల కోసం నియోజకవర్గంకు ఒకటి చొప్పున ఉచిత కోచింగ్ సెంటర్ల‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు. ఉచిత కోచింగ్ లో ప్రతి అభ్యర్ధికి నెలకు రూ.5 వేల చొప్పున చెల్లించ‌నున్న‌ట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement