Saturday, April 27, 2024

భూక‌బ్జా నిరూపిస్తే రాజకీయ సన్యాసం – మంత్రి ఈట‌ల‌

ముందస్తు ప్రణాళికతో వ్యక్తిత్వం దెబ్బతీసే కుట్ర
అంతిమ విజయం ధర్మానిదే… రాజేందర్‌ దేనికీ లొంగడు
ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి
అసైన్డ్‌ భూమి ఒక్క ఎకరా కూడా మా ఆధీనంలో లేదు
నాకు ఆత్మగౌరవం కంటే పదవి ముఖ్యంకాదు

హైదరాబాద్‌, : డబ్బుకు, పదవులకు ఈటల రాజేందర్‌ లొంగే రకం కాదని, ధర్మం తాత్కాలికంగా ఒడిదుడు కుల కు లోనవుతుంది కానీ అంతిమ విజయం దానిదేనని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. భూకబ్జా ఆరో
పణలు రావడం, సీఎం కేసీఆర్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈటల ముందస్తు ప్రణాళికతో కొన్ని ఛానళ్ళు కట్టుకథలు ప్రసారం చేస్తున్నాయని, తెలంగాణ ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న ప్రేమపై విషం చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్‌ విసిరారు. ”నాకు ఆత్మగౌరవం కంటే పదవి గొప్ప కాదు… రాజకీయ కక్షతోనే ఇలాంటి తప్పుడు ప్రచా రాలకు పూనుకుని ఉండొచ్చు. నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి ఎకరం భూ మి కూడా లాక్కోలేదు. నా ఆస్తులు, చరిత్రపై సీఎస్‌, విజిలెన్స్‌, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించుకోవచ్చు. ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నా. విచారిస్తేనే నిజం ఏంటో తెలుస్తుంది. నాపై మందస్తు ప్రణాళికతో కట్టుకథలు అల్లి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పెయిడ్‌ ఆర్టికల్స్‌, తప్పుడు వార్తలు రాస్తే జనం పాతర వేస్తారు” అని ఈటల అన్నారు.
2016లో హ్యాచరీస్‌ పెట్టాం
”2016లో మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలంలో 40 ఎకరాల భూమిని ఎకరం రూ.6 లక్షల చొప్పున కొనుగోలు చేశా. దీనికి కెనరాబ్యాంక్‌ వందకోట్ల లోన్‌ కూడా ఇచ్చింది. ఆ తర్వాత మరో 7 ఎకరాల కొన్నా. ఇందులో ఎక్కడా అసైన్డ్‌ భూమి లేదు. చుట్టూ.. అసైన్డ్‌ ల్యాండ్‌ ఉన్నమాట వాస్తవం. తొండలు గుడ్డుపెట్టని మారుమూల ప్రాంతంలో మేం హ్యాచరీస్‌ పెట్టినం. చుట్టుముట్టు ఉన్న అసైన్డ్‌ భూముల వాళ్ళు తీసుకొమ్మని మావాళ్ళని అడిగితే.. మేం కొనడా నికి.. మీరు అమ్మడానికి కుదరదని చెప్పినం. విస్తరణకు కూడా భూమి అవసరమైంది.. ఇది సీఎంకు కూడా చెప్పిన. సీఎంవో కార్యదర్శి నర్సింగ్‌ రావు రైతులు భూములు అప్పగిస్తే పరిశ్రమల శాఖ ద్వారా దానిని తీసుకోవొచ్చు అని చెప్పారు. ప్రభుత్వం ద్వారానే ఈ ప్రాసెస్‌ జరగాలని దరఖాస్తు చేసినం. అందులో కొందరు అంగీకరించిండ్రు.. కొందరు అంగీకరించలే. ఒక్క ఎకరా భూమి కూడా మేం తీసుకోలేం. భూములన్నీ రైతుల స్వాధీనంలోనే ఉన్నాయి” అని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. సీఎం విచారణకు ఆదేశించడం మంచిదే. సిట్టింగ్‌ జడ్జితో కూడా విచారణ జరపాలి అని కోరారు.
పోరాడుతాడు తప్ప.. లొంగడు
ఈటల రాజేందర్‌ సమస్యలపై పోరాడుతాడు తప్ప లొంగిపోడని చెప్పారు. అక్రమంగా తన దగ్గర ఎకరం భూమి ఉన్నా షెడ్లు కూలగొట్టి తీసుకోవచ్చన్నారు. నా చరిత్ర ఏంటో తెలుసుకో వాలన్నారు. భూమిని కోల్పోయిన పర్వాలేదు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోనన్నారు. తనపై నయీం రెక్కీ నిర్వహించినా బెదరలేదన్నారు. నా ఆస్తులు కరీంనగర్‌ ప్రజలకు తెలుసు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాపై కక్షతో రింగ్‌రోడ్డు తప్పుడు అలైన్‌మెంట్‌తో నా భూమిని లాక్కోవాలని చూసినా.. నాకు ఆస్తులు కాదు ఆత్మాభి మానమే ముఖ్యమని పోరాడిన. నా ఇంట్లో నిత్యాన్న వితరణ ఉంటుంది. నా ఆస్తులు నా చెమట చుక్కలతో సంపాదించాను. 1986 నుండి నేను పౌల్ట్రిలో ఉన్నా. 2004లో నాకు 10లక్షలకు పైగా కోళ్ళు, 170 నుండి 180 ఎకరాల భూమి ఉండేది. అప్పటి నా అఫిడవిట్‌ చూడండి. తర్వాత కొన్ని భూములు అమ్ముకున్నా. నేను ఎపుడూ డబ్బు కోసం, పదవుల కోసం ఆరాటపడే వాడిని కాదు. నేను ముది రాజ్‌, నా భార్య రెడ్డి.. నా కులం మీద కూడా వివాదం రేపారు. ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదు. అయినా నా పదవి గడ్డి పోచతో సమానం అని నేను అవమానకరంగా మాట్లాడను. ఈటల రాజేందర్‌ చరిత్ర పాతికేళ్ల చరిత్ర. నా వద్ద అసైన్డ్‌ భూములు గజం ఉన్నా తీసుకోవచ్చు. సాటి మనిషికి ఆపద వస్తే ముందుండేవాడిని. నేను అవినీతి చేస్తే ఆరుసార్లు నన్ను ప్రజలు గెలిపించరు. నేను అసైన్డ్‌ భూములు తీసుకున్నానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే. రాష్ట్రంలో ఉన్న అన్ని అసైన్డ్‌ భూములపై విచారణ జరిపించాలి. విచారణ తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకుంటా అని ఈటల రాజేందర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement