విడుదలకు సిద్ధంగా ఉన్న గంగూభాయి కతియావాడి మూవీని వివాదాలు వెంటాడుతున్నాయి. మహారాష్ట్ర ఎమ్మెల్యే అమిన్ పటేల్తో పాటు దక్షిణ ముంబైలోని కామాటిపురా వాసి ఒకరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాలో తమ ప్రాంతం పేరు కామాటిపురాని వాడటాన్ని సవాల్ చేస్తూ కోర్టుకెళ్లారు. కామాటిపురా పేరును సెన్సార్ చేయాలని లేదా తొలగించాలని వారు కోరుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద రెడ్లైట్ ఏరియాగా పేరొందిన కామాటిపురాకు చెందిన శ్రద్ధ సుర్వే ఈ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఈ నెల 25వ తేదీన (శుక్రవారం) ఈ సినిమా విడుదలవుతున్నందున తక్షణమే పిటిషన్ను విచారించాలని జస్టిస్ గౌతం పటేల్, మాధవ్ జందార్ తో కూడిన డివిజన్ బెంచ్ను వారు అభ్యర్ధించారు.
అయితే.. ఈ పిటిషన్ను రేపు (బుధవారం) విచారణకు స్వీకరించనున్నట్టు బెంచ్ పేర్కొంది. మరోవైపు ఇదే అభ్యంతరాలతో ఎమ్మెల్యే అమిన్ పటేల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్తో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేయగా దీనిపై కూడా బుధవారం విచారణ చేపడతామని బెంచ్ స్పష్టం చేసింది. 1960 ప్రాంతంలో కామాటిపురాలో అందరి ఆదరణను చూరగొన్న గంగూభాయీ కతియావాడిగా అలియా భట్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. రచయిత ఎస్ హుస్సేన్ జైదీ పుస్తకం మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై ఆధారంగా ఈ సినిమా రూపొందింది.