Wednesday, May 8, 2024

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. సర్క్యూలర్‌ జారీ చేసిన యాజమాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని టీఎస్‌ఆర్‌టీసీ నిర్ణయించింది. ఈ మేరకు యాజమాన్యం సర్క్యూలర్‌ను జారీ చేసింది. గత కొన్నేళ్ళుగా ఈ నియామకాల ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. సంస్థలో పని చేసి ప్రమాదవశాత్తు చనిపోయిన వారి పిల్లలు, వారి వారసుల నియామకాల విషయంలో గత కొన్నేళ్ళుగా సంస్థ దాగుడు మూతలు ఆడింది. ఏప్రిల్‌లో జరిగిన పాలక వర్గ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు కారుణ్య నియామకాల ప్రక్రియ సాగేందుకు యాజమాన్యం మార్గం సుగమం చేసింది.

కారుణ్య నియమకాల కోసం దాదాపు 1500 మంది ఎదురు చూస్తున్నారు. వీరంతా తమ పెద్దను కోల్పోయి గత కొంత కాలంగా సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా యాజమాన్యం సర్క్యూలర్‌ను జారీ చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియామకాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికన జరుపుతున్నట్లు యాజమాన్యం పేర్కొంది. డ్రైవర్‌ గ్రేడ్‌ 2 కింద ఎంపికైన వారికి నెలకు రూ. 19 వేలు, గ్రేడ్‌ 2 కింద ఎంపికైన కండక్టర్లకు రూ. 17 వేలు, కానిస్టేబుళ్ళకు రూ. 15 వేలు, శ్రామిక్‌లుగా ఎంపికైన వారికి రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement