Tuesday, May 14, 2024

పరీక్షలు రద్దు చేయండి: గవర్నర్ కు నారా లోకేష్ లేఖ

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని గవర్నర్ కు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా రెండో దశ తీవ్రతలో పరీక్షల నిర్వహణ విద్యార్థులకు ప్రాణసంకటంగా మారుతుందని అన్నారు. దేశంలోని దాదాపు 20రాష్ట్రాలు, 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని అన్నారు. ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా వైరస్ ను మరింత వ్యాప్తి చేయటమే అని మండిపడ్డారు. లక్షలాది మందికి సురక్షితమైన వాతావరణం కల్పించటం అసాధ్యం అన్నారు. ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడి చనిపోయినా అది క్షమించరాని నేరమే అవుతుంది.

పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ వివరాలను మీ ముందు ఉంచుతున్నానన్నారు. 2 లక్షలకు పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ వద్దంటూ మా ఉద్యమానికి మద్దతు ప్రకటించారన్నారు. కరోనాను అదుపు చేసే చర్యలు తీసుకోకపోగా విస్తృతికి మరింత అవకాశం కల్పించే నిర్ణయాలు ఎంతమాత్రం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకున్న విశేష అధికారాలతో పరీక్షల నిర్వహణపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరుతున్నా అన్నారు. ఆన్ లైన్ ద్వారా వచ్చిన అభిప్రాయాలతో కూడిన 1,778 పేజీలను ఈ లేఖకు జత చేస్తున్నాను అని తెలిపారు. అన్నివర్గాల నుంచి వచ్చిన 1,12,466 అభిప్రాయాలను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు లేఖలో పొందుపరిచాను అని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు, విద్యార్థుల భద్రత దృష్టిలో ఉంచుకుని మీ విశిష్ట అధికారాలతో పరీక్షలు వాయిదా / రద్దు చేసేలా ప్రభుత్వానికి సూచనలు చెయ్యాలని లోకేష్ లేఖలో కోరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement