Monday, May 6, 2024

ఇవ్వాల్టి నుంచే పార్లమెంట్​ భేటీ.. ఈసారి హాట్ హాట్‌గా సాగ‌నున్న ఉభ‌య స‌భ‌లు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవ్వాల్టి (సోమ‌వారం) నుంచి ప్రారంభంకానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు కొన‌సాగుతాయి. ఈ 26 రోజుల్లో 18 సార్లు సభా కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సెషన్‌లోనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక కూడా జరుగనుంది. కాగా, ఇవ్వాల‌ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగనుంది. ఇవ్వాల ఉద‌యం 11 గంటలకు పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పాతవి, కొత్తవి కలిపి మొత్తం 31 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

అదేవిధంగా కాలం చెల్లినవిగా పేర్కొంటూ 71 చట్టాలను తొలగించనున్నారు. అయితే బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ.. సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. బిల్లులపై చర్చించి ఆమోదం పొందేలా చూడాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ధరల పెరుగుదల, అగ్నిపథ్‌ సహా అనేక సమస్యలు ఈ స‌మావేశాల్లో చర్చ‌కు రానున్నాయి. కాగా, ప్రతిపక్షాలు సహకరించినా, సహకరించకపోయినా రోజుకు రెండు బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఇక‌.. కొత్తగా ఎన్నికైన‌ నలుగురు ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిమ్రన్‌జీత్ సింగ్ మాన్ (సంగ్రూర్), ఘన్‌శ్యామ్ సింగ్ లోధి (రాంపూర్), దినేశ్ లాల్ యాదవ్ (ఆజాంగఢ్), శతృఘన్ ప్రసాద్ సిన్హా (అసన్‌సోల్) ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, అబుదాబీ అధినేత షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ సహా పలువురు మాజీ ఎంపీల మృతికి లోక్‌సభ సంతాపం ప్రకటించే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement