తెలంగాణలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పైగా ఏడాదిగా ఎదురుచూస్తున్న పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. దీంతో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో వివాహాది శుభకార్యాలకు 50మందికి మాత్రమే అనుమతిచ్చారు. విపత్తు నిర్వహణ చట్టం కింద ఆ అధికారాన్ని స్థానిక ఎమ్మార్వోకు అప్పగించారు. దీంతో అవే ఆదేశాలను ఇప్పుడు కూడా పాటించాలని ఆదేశించారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇరువైపు బంధువులంతా 50మందికి మించరాదు. వీరి ఆధార్ కార్డులతో పాటు పెళ్లి పత్రిక జిరాక్సుతో అనుమతికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ వివాహం జరిపే స్థలం చుట్టూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా, ఆ స్థానికంగా ఉన్న కరోనా వ్యాప్తిని బట్టి ఎమ్మార్వో అనుమతి ఇవ్వాలో వద్దో నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు.