Thursday, May 2, 2024

తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే.. వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత

రైతు భగవత్ స్వరూపుడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో సోమ‌వారం నిర్వ‌హించిన‌ వానాకాలం పంట‌ల సాగు సన్నద్ధత- అవ‌గాహ‌న‌ సదస్సు లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారని అన్నారు. తెలంగాణలో తొలి ప్రాధాన్యం వ్యవసాయానికే అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. వ్యవసాయానికి నిర్మల్ ప్రాంతం పెట్టింది పేరన్నారు. ఆదిలాబాద్, పాలమూరు జిల్లాలకు ఎంతో సారూప్యత ఉందని తెలిపారు. పత్తి పంటకు ఈసారి మద్దతుధరకు మించి రెట్టింపుగా రూ.12 వేల వరకు ధర పలికిందని గుర్తు చేశారు. వేరుశెనగ మద్దతు ధరకు మించి రూ.9,10 వేల వరకు ధర పలికిందని చెప్పారు. రైతులు ఈ సారి పత్తి, సోయాబీన్ సాగు మీద దృష్టి సారించాలని మంత్రి కోరారు.

పత్తి సాగులో రైతులు విడిగా దొరికే విత్తనాలు, హెచ్ టీ కాటన్ విత్తనాలను ఉపయోగించవద్దని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి దానికి ఖచ్చితంగా రశీదు తీసుకోవాలన్నారు. భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడొద్దని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులు, రసాయనాలను ఉపయోగించాలన్నారు. ఎకరాకు 40 కిలోలకు మించి ఎంత యూరియా వేసినా అది వృధానే అని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు విస్తృతంగా ఎరువులు, రసాయనాల వాడకంపై అవగాహన కల్పించాలన్నారు. రైతులకు ఒకసారి అవగాహన వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటారని తెలిపారు. పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులను వాడి భూమిలో సారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం అంటే పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవడం అని వివరించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం, పంటల దిగుబడి పెంచుకోవడం ద్వారా వ్యవసాయం లాభదాయకం అవుతుందని తెలిపారు. రైతులు సొంత గ్రామాల్లోనే కాకుండా ఇతర గ్రామాలు, మండలాలు, జిల్లాలు పర్యటించి రైతుల విజయాలను గమనించాలని కోరారు. బియ్యం, కందిపప్పు తర్వాత మినుముల వినియోగం దేశంలో అత్యధికంగా ఉంది .. రైతులు దీని సాగుపై దృష్టి సారించాలని సూచించారు.

తెలంగాణ రైతుల ధాన్యం కొనలేక కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో సాహసంతో కొనుగోలుకు ముందుకువచ్చారని చెప్పారు. పంటల మార్పిడిలో భాగంగా ఆయిల్ పామ్ సాగును రైతులు ఎంచుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ ఏడాది 2 నుండి 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో బైబ్యాక్ గ్యారంటీ ఉన్న ఏకైక పంట ఆయిల్ పామ్ అని, అందుకే దీనిని ప్రోత్సహిస్తున్నామన్నారు. పంట నాటిన తర్వాత నాలుగేళ్ల వరకు గొర్రెల పెంపకంతో పాటు, అనేక అంతర పంటలు సాగుచేయొచ్చు అని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement