Saturday, April 27, 2024

Ind vs eng 4th test: నేటి నుంచి ఓవల్ వేదికగా పోరు..

భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ రసవత్తరంగా సాగుతోంది. తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, రెండో టెస్టును టీమిడింయా గెలుచుకుంది, ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ గర్జించడంతో టీమిండియా చతికిలపడింది. ఇప్పుడు సిరీస్ కీలక దశకు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా… మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్‌ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ఓవల్‌ మైదానంలో నేటి నుంచి జరిగే నాలుగో టెస్టు కోసం ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. లీడ్స్‌ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా… గత మ్యాచ్‌ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్‌ దృష్టి పెట్టింది.  

లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. ఓవల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్‌ ఆర్డర్‌ వైఫల్యంతో భారత్‌ ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె సహా ఛతేశ్వర్‌ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినా, యాజమాన్యం అతడికి మరో అవకాశం ఇచ్చింది. మరోవైపు ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలుండడంతో.. సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

మరోవైపు ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అద్భుత ఫామ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు సహా ఐదు వందలకు పైగా పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో ఆటగాడు డేవిడ్‌ మలన్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో అదరగొడుతున్న మార్క్‌ వుడ్‌, తన స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ముప్పుతిప్పలు పెడుతున్న క్రిస్‌ వోక్స్‌ వంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం ఇంగ్లాండ్‌కు బలంగా మారింది. నాలుగో టెస్టులో జోస్‌ బట్లర్‌ స్థానంలో జానీ బెయిర్‌స్టో వికెట్‌ కీపింగ్‌ బాధ్యతలు తీసుకోనున్నాడు. లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన వెంటనే లీడ్స్‌లో ఘోర పరాజయం ఎదురుకావడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సిరీస్‌లో ఆధిక్యం సాధించాలంటే ఒవల్‌ టెస్టులో విజయం సాధించడం తప్పనిసరి. ఈపరిస్థితుల్లో ఇరు జట్లు మేటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాయి.

ఇది కూడా చదవండి: సిరీస్ గెలవాలంటే కోహ్లీని నిశబ్దంగా ఉంచాలి: జో రూట్

Advertisement

తాజా వార్తలు

Advertisement