Thursday, May 2, 2024

drugs case: నేడు ఈడీ విచారణకు ఛార్మి..

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు కలకలం కొనసాగుతోంది. నిన్న ఈ కేసులో కీలక మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారాడు. డ్రగ్స్‌ లావాదేవీల వివరాలను కెల్విన్‌ ఈడీ ముందు బయటపెట్టడంతో.. సినీ తారలకు ఉచ్చు బిగుస్తోంది. డ్రగ్స్ కోసం కెల్విన్ అకౌంట్లోకి సినిమా వాళ్లు భారీగా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌ని ఫ్రీజ్ చేశారు. అతని బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నారు.

ఆరు నెలల క్రితం ఎక్సైజ్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కెల్విన్‌పై కేసు నమోదు చేశారు. విచారణ సమయంలో ఎక్సైజ్ అధికారులకు ఏమాత్రం సహకరించని కెల్విన్.. ఇప్పుడు ఈడీ కేసుతో అప్రూవర్‌గా మారడంతో ఈ కేసుతో సంబంధమున్న సినీ తారల్లో అలజడి నెలకొంది. అప్రూవర్‌గా మారిన కెల్విన్ ఈడీ అధికారుల ముందు డ్రగ్స్ తీసుకున్న సినిమా స్టార్స్ చిట్టా విప్పాడు. అతని స్టేట్‌మెంట్ ఆధారంగానే సినిమా స్టార్లకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.

కాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ సినీ నటి ఛార్మి.. ఈడీ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో ఛార్మి బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత కాలంగా కెల్విన్ తో చార్మికి పరిచయం ఉంది? డ్రగ్స్ సేవించారా? కెల్విన్ తో పాటు సరఫరాకు కూడా సహకరించారా? అసలు ఎన్ని సార్లు కెల్విన్ అకౌంట్ కు ఛార్మి… మనీ ట్రాన్స్ఫర్ చేసిందన్న కోణాల్లో ఆధారాలతో కూడిన విచారణ చేయనుంది ఈడీ.

ఇది కూడా చదవండి: సీఏం ఎక్కడుంటే అదే రాజధాని అనడం దారుణం: రఘురామ

Advertisement

తాజా వార్తలు

Advertisement