సీఎం జగన్ పాలన అంతా తప్పులమయమని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. 2019 నుంచి జగన్ పాలనలో 100 పనులు చేస్తే.. అందులో 99 సుద్ధ తప్పులే ఉన్నాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాన్యులకు ఊరట లేకుండా ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. అయిన రాష్ట్ర ప్రభుత్వం దున్న పోతు మీద వర్షం పడ్డట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎంత సేపు నీచ రాజకీయాలు చేయడమే తప్ప రాష్ట్ర ప్రజల పైన ఇసుమంత ఆయిన ఆలోచన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తప్పుల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడం కూడా వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల గురించి ప్రభుత్వం నుంచి సమాధానం లేదని, ప్రత్యేక హోదా గురించి సమాధానం లేదని, పెరిగిన ధరల గురించి సమాధానం లేదని, ఉద్యోగుల సమస్యలపై సమాధానం లేదని దుయ్యబట్టారు. అయినప్పటికీ ప్రజల దృష్టిని ఈ సమస్యల నుంచి మళ్లించిందని అన్నారు. 99 తప్పులు చేసిన జగన్ ఒకే ఒక మంచి పని చేశారని… అది కృష్ణా జిల్లాను విభజించి ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడమని గోరంట్ల చెప్పారు.