తెలంగాణలో పార్టీ పరిస్థితులపై బీజేపీ అధిష్ఠానం దృష్టిసారించింది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీ రావాలని ఆదేశించింది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఢిల్లీలోనే ఉండటంతో… తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో హైదరాబాద్లో ఇవాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న కిషన్రెడ్డి.. ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు.
ఈటల, రాజగోపాల్రెడ్డితో నిర్వహించనున్న భేటీలో కిషన్రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలో బీజేపీ దూకుడు కాస్తంత తగ్గిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ స్తబ్దతను తొలగించి రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేలా అదిష్ఠానం అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇక అసంతృప్త నేతలను బుజ్జగించే అంశంపై కూడా బీజేపీ పెద్దలు దృష్టిసారిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై పార్టీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.