Friday, July 26, 2024

Delhi | పార్లమెంట్‌కు సీఐఎస్‌ఎఫ్‌ సెక్యూరిటీ…

పార్లమెంట్‌ సమగ్ర భద్రత బాధ్యతలు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)కు అప్పగించడం జరిగింది. సీఐఎస్‌ఎఫ్‌ ఉగ్రవాద నిరోధక బృందానికి చెందిన 3,317 మంది సిబ్బంది నేటి నుంచే (సోమవారం) విధులు నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి.

ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌, ఢిల్లి పోలీస్‌, పార్లమెంట్‌ సెక్యూరిటీ స్టాఫ్‌ బృందాలు సంయుక్తంగా ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నాయి. రేపటినుంచి పార్లమెంట్‌ భద్రత బాధ్యతల నుంచి వీరు వైదొలగనున్నారు. ఇకపై ఈ విధులను సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) నిర్వర్తించనుంది.

గత శుక్రవారం పార్లమెంటు కాంప్లెక్సులోని పరిపాలన, కార్యాచరణ విభాగాలను సీఐఎస్‌ఎఫ్‌ ఉన్నతాధి కారులకు పీడీజీ కమాండర్‌ అప్పగించారు. దీంతో తమ ఆయుధాలు, వాహనాలు, కమాండోలను ఉపసంహరించుకునేందుకు పీడీజీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

గత 10 రోజులుగా జల్లెడ

సెంట్రల్‌ ఢిల్లిలో ఉన్న పార్లమెంటు కాంప్లెక్స్‌లో పాత పార్లమెంటు భవనం, కొత్త పార్లమెంటు భవనం, వాటి అనుబంధ నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికి ఇకపై 3,317 మంది సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది రక్షణ కల్పించనున్నారు.

- Advertisement -

పార్లమెంటు కాంప్లెక్సులోని అన్ని ఫ్లాప్ ఎంట్రీ గేట్‌లు, పోస్టెడ్‌ కెనైన్‌ స్క్వాడ్‌లు, ఫైర్‌ టెండర్లు, సీసీటీవీ మానిటరింగ్‌ కంట్రోల్‌ రూమ్‌, కమ్యూనికేషన్‌ సెంటర్‌, వాచ్‌ టవర్‌ వంటి విభాగాల్లో ఇప్పటికే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది విధులు మొదలుపెట్టారు. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది గత 10 రోజులుగా పార్లమెంటు కాంప్లెక్స్‌ను అణువణువూ జల్లెడ పడుతున్నట్లు సమాచారం.

ప్రత్యేక డ్రెస్‌కోడ్‌

పార్లమెంటులో విధులు నిర్వర్తించే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సఫారీ సూట్‌లు, లేత నీలం రంగు ఫుల్‌ స్లీవ్‌ షర్టులు, బ్రౌన్‌ ప్యాంట్‌లు యూనిఫామ్‌గా ఉంటాయి. పార్లమెంట్‌ డ్యూటీ గ్రూప్‌లో భాగంగా సేవలందించిన పార్లమెంట్‌ సెక్యూరిటీ స్టాఫ్‌ (పీఎస్‌ఎస్‌)ను భవిష్యత్తులోనూ పార్లమెంటు ప్రాంగణంలో మార్షల్‌ విధుల కోసం, లాబీల పహారాకు వినియోగించే అవకాశం ఉంది.

కొంతమంది పీఎస్‌ఎస్‌ సిబ్బందిని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలలో భద్రత, ప్రోటోకాల్‌ విధుల కోసం మోహరించనున్నారు. పార్లమెంటు నుంచి సేవలను ఉపసంహరించుకోనున్న పార్లమెంట్‌ డ్యూటీ గ్రూపును సీఆర్పీఎఫ్‌ ఆరో బెటాలియన్‌కు చెందిన వీఐపీ భద్రతా విభాగంలో విలీనం చేయాలని యోచిస్తున్నారు.

అయితే ఈ అంశాలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి తాత్కాలిక ప్రాతిపదికనే సీఐఎస్‌ఎఫ్‌కు పార్లమెంటు భద్రతా విధులను అప్పగిస్తున్నారని, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని పూర్తిస్థాయి సేవల కోసం అప్‌గ్రేడ్‌ చేయనున్నారని తెలుస్తోంది.

2023 డిసెంబరు 13 ఘటనతో

గతేడాది డిసెంబర్‌ 13న పార్లమెంటు భద్రతా ఉల్లంఘన వ్యవహారంతో దేశంలో కలకలం రేగింది. పార్లమెంటు జీరో అవర్‌ టైంలో ఇద్దరు యువకులు పబ్లిక్‌ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి ఎంపీలపైకి రంగుల పొగలను స్ప్రే చేస్తూ హల్‌చల్‌ చేశారు. అప్పట్లో పార్లమెంట్‌ కాంప్లెక్స్‌ భద్రతా సమస్యలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడానికి సీఆర్పీఎఫ్‌ డీజీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

2001 సంవత్సరంలో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి సమయంలో సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అలాంటిది ఇప్పుడు పార్లమెంటు భద్రతా విధుల నుంచి వైదొలగాల్సి వస్తుండటంపై సీఆర్పీఎఫ్‌ వర్గాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, దాదాపు 1.7 లక్షల మంది సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్‌ కేంద్ర హోంశాఖ ఆధీనంలోని కేంద్ర సాయుధ పోలీసుదళం, ఢిల్లిలోని పలు కేంద్రమంత్రిత్వ శాఖల భవనాలతోపాటు పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్‌ కేంద్రాలు, ఢిల్లి మెట్రో వద్ద భద్రత విధులు నిర్వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement