Thursday, May 16, 2024

ప్ర‌జాప్ర‌తినిధులు, ఉద్యోగుల జీతాల నుంచి హ‌రిత‌నిధికి విరాళాలు.. ఆదేశాలు జ‌రీ చేసిన ప్ర‌భుత్వం

హరితనిధి విధివిధానాలు, విరాళాల జమపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో అంసెబ్లీ కమీటీ హాల్ లో సమీక్ష జ‌రిగింది. ఈ సమావేశంలో మంత్రులు హ‌రీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావుతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ది, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా ఉన్న తెలంగాణ.. హరితనిధి ఏర్పాటుతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంద‌ని మంత్రులు అన్నారు. రాష్ట్రం పచ్చబడాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో దేశంలోనే తొలిసారిగా హరితనిధి ఏర్పాటైంద‌ని, హరిత తెలంగాణ సాధనలో సమాజంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం విరాళాల రూపంలో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిధి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన‌ట్టు తెలిపారు. ఏప్రిల్ నెల జీతాల నుంచి ఈ విరాళాల జమ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, ఇందుకోసం సంబంధిత శాఖలు అంతర్గత ఉత్తర్వుల ద్వారా పనిని ప్రారంభించాలని, అలాగే తెలంగాణకు హరితహారం, హరితనిధి ఉద్దేశ్యాలను అందరికీ అర్థమయ్యేలా వివరించాలని మంత్రులు తెలిపారు. ఇప్పటికే ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కంపెనీలు, షాపులు, వివిధ ఎస్టాబ్లిష్ మెంట్ల నుంచి తగిన మొత్తం హరిత నిధికి జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాక కార్యదర్శి సునీల్ శర్మ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్. ఎం. డోబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ ఎం.సీ. పర్గెయిన్, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీమ్, సివిల్ సప్లయిస్ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement