Monday, July 22, 2024

HYD: రైతుల హామీలు నెర‌వేర్చ‌ని అసమర్ధ సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి స‌బిత‌

మహేశ్వరం అర్బన్, మే 16 (ప్రభ న్యూస్) : రైతుల‌కు ఇచ్చిన ఒక్క హామీ నెర‌వేర్చ‌ని అస‌మ‌ర్ధ సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్త నిరసనకు అధినేత కేసీఆర్ పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం గేట్ శ్రీశైలం రహదారిపై సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం, దగా చేయడమేనని విమర్శించారు.

రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎట్లా ప్రకటిస్తది ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వంచించిందన్నారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందన్నారు. అందుకే నాలిక మల్లేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారన్నారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు తుక్కు చేసేవాళ్లన్నారు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు. రైతు బంధు, రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement