Sunday, May 19, 2024

దేశంలో అందుబాటులోకి మరో టీకా

దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ వంటి టీకాలు అందుబాటులో ఉండగా తాజాగా మరో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. జైడస్‌ క్యాడిలా కంపెనీకి చెందిన ‘విరాఫిన్‌’కు అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జైడస్‌ అందించిన డేటాపై నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే కంపెనీ మూడో దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ప్రయోగాల్లో కేవలం సింగిల్‌ డోసులతోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు సంస్థ ఇటీవల వెల్లడించింది. విరాఫిన్‌ వ్యాక్సిన్‌ను సాంకేతికంగా ‘పెగిలేటెడ్‌ ఇంటర్ఫెరాన్‌ ఆల్ఫా-2బీ’(PegIFN)గా పిలుస్తారు. కరోనా రోగులకు చికిత్స కోసం పెగిలేటెడ్‌ ఇంటర్ఫెరాన్‌ ఆల్ఫా-2బీ ఔషధంపై జైడస్‌ క్యాడిలా ఫార్మా సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించింది.

దీని కోసం దాదాపు 250 కరోనా రోగులపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. ఈ ఔషధం తీసుకున్న ఏడు రోజుల్లో 91.15శాతం రోగుల్లో కరోనా నెగెటివ్‌ (ఆర్టీపీసీఆర్‌) వచ్చినట్లు ప్రయోగాల్లో గుర్తించింది. అంతేకాకుండా రోగులకు ఆక్సిజన్‌ అవసరమయ్యే సమయాన్ని 80గంటల నుంచి 56గంటలకు తగ్గించినట్లు తేలింది. కొవిడ్‌ రోగులకు ఒక్క డోసు ఇవ్వడం ద్వారా వారిలో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు కనుగొంది. ఈ PegIFN ఔషధాన్ని కరోనా రోగులకు ఇవ్వడం ద్వారా వైరస్‌ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు తీవ్ర సమస్యల నుంచి బయటపడవచ్చని జైడస్‌ క్యాడిలా వెల్లడించింది. కాగా త్వరలోనే రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా భారత్‌లో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement