Saturday, April 27, 2024

హుజురాబాద్ లో పోటీపై పెద్దిరెడ్డి క్లారిటీ.. ఈట‌ల చేరిక‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆపార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కాస్త మెత్తబడ్డారు. బీజేపీలో చేరేందుకు ఈట‌ల ఒక్క‌డే కాదు సీఎం కేసీఆర్ వచ్చినా స్వాగ‌తిస్తామ‌ని ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ నుండి ఎవ‌రు పోటీ చేయాలో ఎన్నిక‌ల‌ప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను తాను కలవలేదని, ఆయన ఫామ్‌హౌస్ ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. బీజేపీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారని, వారందరూ అర్హులేనని పెద్దిరెడ్డి చెప్పారు.

గతంలో ఈటల బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. తాను నాలుగు పర్యాయాలు హుజూరాబాద్‌ నుంచి పోటీ చేశానని, రెండు సార్లు మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. అలాంటి తనను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక వ‌స్తే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఓ ద‌శ‌లో పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేర‌బోతున్నార‌న్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో స్పందించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఆయనతో చర్చలు జరిపింది. దీంతో పెద్దిరెడ్డి మెత్త పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement