Tuesday, April 30, 2024

Bandi: రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది.. దేశ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు

రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైందని, ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదన్నారు. ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నరని సర్వేలు చెబుతుండటంతో తట్టుకోలేక బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నడని విమర్శించారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టలంటూ, జైళ్లంటూ భయపెడుతున్నడని మండిపడ్డారు.

రాబోయే రోజుల్లో ఈ నిర్బంధాలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా బీజేపీ నేతలెవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. జాతీయ నాయకత్వం మనకు పూర్తి అండగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై ఉద్రుతంగా పోరాడాలని సూచించారు. టీఆర్ఎస్ నేతల ఆరోపణలను, విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి అని బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలుసహా స్థానిక ప్రజా ప్రతినిధులెవరికీ పనులు చేయొద్దంటూ కేసీఆర్ అనధికార ఆదేశాలిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో ఎన్నడూ ఇలాంటి దుష్ట సాంప్రదాయం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలకూతగిన గౌరవం ఉంటోందని అన్నారు. చివరకు రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళ సై విషయంలోనూ కేసీఆర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ మేడారం వెళ్తే హెలికాప్టర్ సమకూర్చకుండా… మంత్రులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలకకుండా చేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement