Monday, May 20, 2024

TS: రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న బీజేపీ.. తస్మాత్ జాగ్రత్త… మంత్రి పొన్నం

అక్కన్నపేట, ఏప్రిల్ 30 (ప్రభ న్యూస్) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని రాష్ట్ర రవాణా అండ్ బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా భారీ ర్యాలీ అనంతరం కార్నర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… రెండు పర్యాయాలు కేంద్రంలో పాలన సాగించిన బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో కులం పేరుతో ప్రజలను విభజించి రాజ్యాంగానికి తూట్లు పొడిచే దుశ్చర్యకు పాల్పడుతుందని ఆరోపించారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన బిజెపి సర్కార్ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలని పిలుపునిచ్చారు.

మచ్చలేని స్వార్థపరుడైన వెలిశాల రాజేందర్రావును పార్లమెంటుకు పంపాలని కోరారు. హుస్నాబాద్ నుండి జనగాం వరకు ఫోర్ లైన్ల రోడ్డు నిర్మాణానికి తనను పార్లమెంటుకు పంపిస్తే తప్పకుండా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తానని పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు తెలిపారు. గండిపల్లి, గౌరవేల్లి ప్రాజెక్టు పనులను పూర్తిచేసి రైతాంగానికి నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతులు తీసుకొని పనులు సైతం ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అభివృద్ధికి నిధులు లేక గల్లాపెట్ట ఖాళీ చేసిన ఘనుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా పాలన దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నాయకులు చిల్లర మల్లారం మాటలు మానుకోవాలని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కాంగ్రెస్ పార్టీ త్యాగాలను పార్టీలు మర్చిపోయిన ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేశారు. భారతదేశ రాజ్యాంగానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్షణ కవచంగా ప్రజలకు అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.

కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఎన్ని నిధులతో అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. మతాల పేరుతో ,కులాల పేరుతో, దేవుళ్ళ పేరుతో రాజకీయాలు చేసే బిజెపి పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలని రాష్ట్ర రవాణా అండ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షులు శివయ్య, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ధరావత్ తిరుపతి నాయక్, ఎండి అక్బర్ పాషా, పొడిశెట్టి వెంకటయ్య, గంగారపు అనిల్ కుమార్ పాండ్రాల దాము, బండి కుమార్, బుర్ర ప్రభాకర్, బద్దం రాజిరెడ్డి, చింతల మల్లారెడ్డి, చింతల బాలరాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement