Saturday, April 27, 2024

T20 World Cup: ఇవ్వాలే దాయాదుల సమరం.. ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ

ఐసీసీ టీ 20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి రంగం సిద్దమైంది. ప్రపంచక్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్‌ పాక్‌ మ్యాచ్‌కు ఇరు జట్లు వ్యూహ ప్రతి వ్యూహాలతో సన్నద్దమయ్యాయి. ఇవ్వాల మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమి, ఆసియాకప్‌ కోసం పాక్‌ పర్యటనకు వెళ్లబోమన్న బీసీసీఐ ప్రకటన తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనే స్థాయికి చేరిన నేపథ్యంలో మ్యాచ్‌ జరగనుంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

దాయాదుల మధ్య సమరం క్రికెట్​ ప్రేమికుల మధ్య మరింత ఉత్కంఠం రేపుతోంది. గత ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి సూపర్‌ -12 మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్‌ సేన భావిస్తోంది. తమకు ఇదో మ్యాచ్‌ మాత్రమేనని ఇరు జట్ల సారథులు ప్రకటించినా టీ 20 ప్రపంచకప్‌ ప్రారంభ మ్యాచ్‌ కావడంతో భారత్‌ పాక్‌ జట్లపై విపరీతమైన ఒత్తిడి ఉంది.

రోహిత్‌పైనే ఆశలు

బ్యాటింగ్‌లో రోహిత్‌ సేన బలంగా కనిపిస్తోంది. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ , రాహుల్‌, కోహ్లీ రాణించడంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని మాజీలు అంచనా వేస్తున్నారు. పాక్‌ స్పీడ్‌ స్టర్‌ షాహిన్‌ షా అఫ్రిదిని ఎదుర్కొని పవర్‌ ప్లేలో చేసే పరుగులే రోహిత్‌ సేన విజయాన్ని నిర్ణయిస్తాయని విశ్లేషణలు ఉన్నాయి. జట్టు కూర్పుపై భారత్‌ సతమతమవుతోంది. భారత బ్యాటర్లలో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, కోహ్లీఫామ్‌లో ఉండటం టీమిండియాకు కలిసిరానుంది.

- Advertisement -

మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తిక్‌, హార్థిక్‌ పాండ్యాలతో బ్యాటింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. టి 20 ర్యాకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌ పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆడే సూర్య మరోసారి విధ్వంసం సృష్టిస్తే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయం. టీమిండియాను బౌలింగ్‌ కలవరపాటుకు గురి చేస్తుంది. భారీ స్కోరు సాధిస్తున్నా బౌలర్లు లక్ష్యాలను కాపాడుకోలేకపోవడం మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక భువనేశ్వర్‌ కుమార్‌, మహమ్మద్‌ షమీ, అర్షదీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌ పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

పాక్‌ పట్టుదల

భారత్‌పై మరోసారి విజయం సాధించాలని బాబర్‌ ఆజం సేన పట్టుదలగా ఉంది. గత ప్రపంచకప్‌లో షాహిన్‌ షా అఫ్రిది 31 పరుగులకే మూడు వికెట్లు తీసి భారత ఓటమిని శాసించాడు. గాయం నుంచి కోలుకున్న అఫ్రిది ఈ మ్యాచ్‌లో రాణించాలని పాక్‌ భావిస్తోంది. షాన్‌ మసూద్‌, ఫఖర్‌ జమాన్‌, మహమ్మద్‌ నవాజ్‌, ఖుష్దిల్‌ షా కూడా రాణిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌లో సారథి బాబర్‌ ఆజం, నవాజ్‌ కీలకంగా మారనున్నారు.

టాస్‌ కీలకం

ఈ మ్యాచ్‌లో టాస్‌ కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని.. టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ చేయడానికి మొగ్గు చూపే అవకాశం ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ ఎమ్‌సిజీలో భారత్‌ పాక్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని ఆసియా వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం వల్ల మ్యాచ్‌ మొత్తం రద్దు కాకపోవచ్చని ఓవర్లు కుదించైనా పోరు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందని మాజీలు విశ్లేషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement